Thursday 15 December 2016

కొత్త నీలి గౌను


1909 లో వసంత ఋతువు క్లీవ్ లాండ్ నగరానికి వచ్చేటప్పటికి, అది ఏమాత్రం గేట్స్ అవెన్యును మార్చలేదు. గేట్స్ అవెన్యు దగ్గరలో వున్న వీధుల్లో నివసించే వాళ్ళు మాత్రం ఇళ్ళకు రంగులు వేసుకుని, ఇంటి చుట్టూ అందమైనతోట పెంచుకున్నారు. గేట్స్అవెన్యు మాత్రం ఎప్పటిలాగే మురికిగా,అసహ్యంగా ఉండిపోయింది. గేట్స్ అవెన్యు ఒక చిన్న వీధి, అయితే మురికిగా వుండడం వలన అది పొడుగ్గా కనపడుతుంది. అక్కడ నివసించే కుటుంబాలన్నీ పేదవి. వాళ్ళ దగ్గర డబ్బులుండేవి కావు. వాళ్లకు అధికంగా సంపాదించాలని కోరిక వుండేది కాదు. వాళ్ళెవరూ చాలా ఏళ్లుగా వాళ్ళ ఇళ్ళకు రంగులు కూడా వేసుకోలేదు. అంతే కాదు వాళ్లకు నీటి సౌకర్యం కూడా వుండేది కాదు. ఆ వీధి మొత్తం ఎంతో మురికిగా వుండేది . ఆ వీధిలో నడిచేందుకు సరైన దారి లేదు, వీధి దీపాలు లేవు. గేట్స్ అవెన్యు వీధి చివర రైలు పట్టాలు వుండడం వలన ఎక్కువ శబ్దాలు, దుమ్ము, ధూళి వచ్చి ఆ వీధిని మరింత మురికి చేసేవి .

గేట్స్ అవెన్యు దగ్గరలో వుండే స్కూల్ లో చదివే అమ్మాయిలంతా కొత్తవి, అందమైన గౌన్లు వేసుకున్నారు. కానీ గేట్స్ అవెన్యు నుండి వచ్చే చిట్టి మాత్రం అదే చినిగి పోయిన, చలికాలంలో వేసుకున్న పాతదైన గౌనే వేసుకుని స్కూలుకు వచ్చింది. బహుశ ఆ అమ్మాయికి అదొక్క గౌనే ఉందేమో! చిట్టి టీచర్ కు చాలా అసంతృప్తి కలిగింది. నిజానికి చిట్టి ఎంతో ముద్దుగా వుంటుంది.అంతే కాక ఎంతో కష్టపడి చదువుతుంది, అందరితో ఎంతో స్నేహంగా, సభ్యతగా వుంటుంది. కానీ చిట్టి ముఖం సరిగ్గా కడుక్కోదు.ఆమె జుట్టు శుభ్రంగా వుంచుకోదు. ఎవరు చిట్టిని చూసినా బురదలోని తామరపూవులా వుంది అనుకుంటారు.

ఒక రోజు టీచర్ చిట్టితో అంది " రేపు స్కూల్ కు వచ్చే ముందు ముఖం కడుక్కుని రావా ...! ప్లీజ్ నాకోసం అది చేయవా ! ప్లీజ్ నా కోసం. "

మరుసటిరోజు చిట్టి ముఖం, జుట్టు శుభ్రంగా వున్నాయి. చిట్టి ఇంటికెళ్ళే ముందు టీచర్ అంది " బంగారు తల్లీ ఇప్పుడు మీ అమ్మను రేపు నీ గౌనును వుతకమని చెప్పు . "

కానీ చిట్టి మళ్ళీ అదే మురికి గౌనుతో బడికి వచ్చింది.'బహుశ వాళ్ళమ్మకు చిట్టి మీద ఏమీ ఆసక్తి లేదేమో!అనుకుంది టీచర్. అందుకే ఒక అందమైన నీలిరంగు గౌను కొనుక్కొచ్చి చిట్టికి ఇచ్చింది. చిట్టి టీచర్ ఇచ్చిన బహుమతిని తీసుకుని ఆనందంగా, ఆత్రుతగా ఇంటికి పరిగెత్తింది .

మరుసటి రోజు అమ్మాయి కొత్త నీలి రంగు గౌను వేసుకుని, ఎంతో శుభ్రంగా , చక్కగా తయారయి స్కూల్ కు వచ్చింది. అమ్మాయి టీచర్ తో అంది: " ఈ ఉదయం మా అమ్మ కొత్త నీలి రంగు గౌను లో నన్ను చూసి తన కళ్ళను తానే నమ్మలేకపోయింది, మా నాన్న ఇంట్లో లేరు, కానీ రాత్రి భోజనానికి వస్తారు అప్పుడు నన్ను కొత్త నీలి గౌనులో చూస్తారు ."


ఆ రోజు చిట్టి అమ్మాయి చాలా వుత్సాహంగా ఉంది. వాళ్ళ నాన్న అమ్మాయిని కొత్త నీలి గౌనులో చూసి తన కింత అందమైన అమ్మాయి ఉందా అని ఆశ్చర్యపోయాడు. కుటుంబం అంతా భోజనానికి కూర్చున్నాక వంటగదిలో టేబిలు పైనున్న టేబిల్ క్లాత్ ను చూసి అతనింకా ఆశ్చర్యపోయాడు. వాళ్ళింట్లో ఇంతవరకు టేబిల్ క్లాత్ లాంటివి వాడడం అతను చూడలేదు.

"మనమిప్పటి నుండి పరిశుభ్రంగా ఉండాలి" అతని భార్య, భర్తతో అంది " నాకు సిగ్గుగా ఉంది మన అమ్మాయి ఇంత శుభ్రంగా ఉంటే మనం ఇంత మురికిగా ఉండడం. "

భోజనాలయ్యాక చిట్టి తల్లి వంట గది అంతా శుభ్రం చేస్తూ ఉండగా కొన్ని నిముషాల సేపు ఆమె భర్త ఆమె చేస్తున్నదంతా మౌనంగా చూశాడు. తర్వాత బయటికి వెళ్లి ఇంటి కంచెను బాగు చేయడం మొదలు పెట్టాడు. మరుసటి రోజు కుటుంబం సహాయంతో చిట్టి నాన్న ఇంటి ముందు మంచి తోట తయారు చేయడం మొదలెట్టాడు.ఆ వారం అంతా చిట్టి పక్కింటతను వీళ్ళు చేసేదంతా గమనించాడు.వారం చివర్లో పక్కింటతను పదేళ్ల తర్వాత తన ఇంటికి రంగులేశాడు. కొద్దీ రోజుల తర్వాత యువకుడైన ఒక చర్చ్ మినిష్టర్ గేట్స్ అవెన్యూ లోని ఆ రెండు ఇళ్ల ముందుగా వెళుతూ ఆ ఇద్దరు పని చేసేది చూశాడు . మొట్టమొదటి సారిగా ఆ వీధికి నడిచే దారి లేదని, వీధి దీపాలు లేవని, కుళాయి నీళ్లు లేవని గ్రహించాడు. "ఇళ్లను పరిశుభ్రంగా పెట్టుకోవడానికి శ్రమించే వాళ్లకు సహాయం చేయాలి" అనుకున్నాడు చర్చ్ మినిష్టర్ . వెంటనే ఆ ఊర్లోని కొంతమంది ప్రముఖుల్ని వాళ్లకు సహాయం చేయవలసిందిగా కోరారు. కొద్దీ నెలల తర్వాత యువకుడైన ఆ చర్చ్ మినిష్టర్ కారణంగా గేట్స్ అవెన్యూకు నడిచేదారి వచ్చింది, వీధి దీపాలు వచ్చాయి, అన్ని ఇళ్లకు కుళాయి నీళ్లు కూడా వచ్చాయి. చిట్టి కొత్త గౌను వేసుకున్న ఆరు నెలల తర్వాత గేట్స్ అవెన్యూ గౌరవనీయులైన ప్రజలు నివసించే ఒక పరిశుభ్రమైన వీధిగా మారిపోయింది .

మిగతా ప్రాంతపు ప్రజలు గేట్స్ అవెన్యూ కథ విన్న తర్వాత వాళ్ళు కూడా పారిశుధ్య కార్యక్రమాలు మొదలు పెట్టారు. 1913 నుండి ఏడువేల చిన్న పట్టణాలు, పెద్ద నగరాలు దీన్ని ఉద్యమంగా తీసుకుని ఇళ్లకు రంగులువేయ్యటం, ఇళ్లను మరమ్మత్తు చేయడం, ఇళ్లను మంచి నివాసయోగ్యoగా చేయడం ద్వారా ఆ ఇళ్ళలో నివసించే వాళ్లకు మంచి జీవితం అందినట్లయింది.

ఎవరు ఊహించారు ఒక టీచర్ ఒక చిట్టికి కొత్త నీలి గౌను ఇచ్చినప్పుడు ఏం జరుగుతుందో !



మూలం : అజ్ఞాత రచయిత అమెరికన్ కథ “ న్యూ బ్లు డ్రెస్”

అనువాదం : డాక్టర్ పేరం ఇందిరా దేవి , ప్రచురణ: విపుల, డిశంబర్, 2016

జీవన గమనం


చల్లగాలి వీచే సాయం సమయానికి నా కాళ్ళు నాకు తెలియకుండానే అటు కేసి నడుస్తాయి విశాలమైన మైదానం లో పెద్ద పెద్ద చెట్లు ,బాగా పెరిగిన పచ్చిక పై సిమెంటు బెంచీలు వుంటాయి. ఈ బిజీ పట్టణం లో ప్రశాంతమైన ప్రదేశం ఇదొక్కటే .ఈ పార్కు లేకపోతే అన్నవూహ కూడా భరించలేను. రొదలమధ్య నుండి నిశ్శబ్దానికి ,అల్లరి ,హడావుడి నుండి నిర్మలత్వానికి అది ఆనవాలు .విభిన్నమైన మనుషులు మనస్తత్వాల సమ్మేళనం.ధనిక, పేద తార తమ్యాల్ని,కుల,మత, జాతి, రీతి విచారించని దివ్యక్షేత్రం. చల్లని నీడనిచ్చే చెట్టుకింద కూర్చున్నాను... పిల్లలు ఆడుకుంటున్నారు. కొందరు తల్లి దండ్రులే పిల్లల్ని ఆడిస్తున్నారు. చెట్ల క్రింద కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్న రకరకాల జంటలు, ప్రేమలో పడి,మునిగి తేలుతున్న యువకులు ప్రియురాళ్ళ కళ్ళ లోకి చూస్తూ ప్రపంచాన్ని మరిచి పోతున్నారు.. వృద్ద దంపతులు కొంతమంది ఇంట్లో చెప్పుకోలేని, వివరించుకోలేని బాధల్ని ఇక్కడ వ్యక్తపర్చుకుంటున్నారు. మధ్య తరగతి భార్యా భర్తలు ఇరుకు గదుల్లో, పిల్లల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య పొందలేని ఏకాంతాన్ని, సాన్నిహిత్యాన్ని పొందాలని వచ్చారు. వాళ్ళ మధ్య ఆర్తి ...ఏదో తెలియ జేయాలనే ఆరాటం , ఏదో చెప్పాలనే తపన, తమలోని ఆలోచనల్ని, భావాల్ని, బాధల్ని, గోడుని, తమ జీవిత భాగస్వామి తో పంచుకోవాలని, వాళ్ళ దగ్గర ఓదార్పు పొందాలనే ప్రయత్నం చేస్తుంటారు .ఆ ప్రయత్నాల్లో ఆవేశాలు కొందరిలో , కొందరిలో ఆవేదన, మరి కొందరిలో కన్నీళ్లు బయట పడుతుంటాయి .రోజూ కనిపించే జంటలే ఒక రోజు సంతోషంగా ,మరు రోజు ఉదాసీనంగా , ఇంకొక్కరోజు కన్నీళ్ళ పర్యంతం అవుతుంటారు .ఓదార్పు పొంది చిరునవ్వు తో తిరిగి పోయే వాళ్ళు కొందరు, గుండె బరువు దించు కుందామని గుండె విప్పి మరింత గాయంతో గుండె బరువుతో వెళ్ళే వాళ్ళు కొందరు ,తమ సమస్య ను చెప్పుకునే ఆరాటంలో తామెక్కడున్నామో మరిచి, అరిచి చుట్టు పక్క వాళ్ళు చూసాక సిగ్గుతో ,అవమానంతో మరింత బాధని మోసుకెళ్ళే వాళ్ళు మరికొందరు.

ప్రేమించే సమయంలో ప్రియురాళ్ళ అందమైన ముఖం తప్ప వేరే గుర్తురాని అబ్బాయిలకి, అమ్మాయి పెళ్లి ఊసు ఎత్తగానే ,అమ్మనాన్న ,కులం, మతం ,ఆస్తి ,అంతస్తు గుర్తు వస్తాయి .కొన్ని రోజులు దాట వేసే మాటలు జరుగుతాయి ,అమ్మాయి పట్టు విడవ కుండా అదే ప్రస్తావన తెస్తే ఇంక తర్వాత అబ్బాయి రాడు ,అమ్మాయి వచ్చి ఎదురు చూసి ఎదురు చూసి ,సెల్ ఫోన్ లోంచి ఎన్ని కాల్స్ పోయినా జవాబు రాదు, తర్వాత స్విచ్ ఆఫ్ వస్తుంది .కొన్ని రోజులు అమ్మాయి అదే చోటుకు వచ్చి జ్ఞాపకాలు వెదుకుతుంది ,కన్నీళ్లు వదులుతుంది. తర్వాత అమ్మాయి కనపడదు .అబ్బాయి కనపడడు. కొద్ది రోజుల తర్వాత కొన్ని సార్లు కొత్త అమ్మాయితో అబ్బాయి మళ్ళీ కనపడతాడు ,అమ్మాయి మరి కొంతకాలం తర్వాత పెళ్లి చేసుకుని భర్తను తీసుకుని ఆనందంగా నాలుగైదు రోజులు వరుసగా యిద్దరు కబుర్లు చెప్పుకుంటూ సంతోషంగా కనపడతారు ,మరి తర్వాత అత్త గారింటికో,భర్త దగ్గరికో వెళ్లి వుంటుంది కనపడదు. కొన్ని నెలలకు నిండు గర్భినిగా చల్లగాలి పీల్చుకోవడానికి వస్తుంది. తర్వాత బుడి బుడి నడకల పాపాయి ని తీసుకొచ్చి ఆడిస్తుంది . ఇది స్త్రీ జీవనగమనం.

పుస్త కాలు తలక్రింద పెట్టుకుని పడుకునే అబ్బాయిలు బహుశా అందులోసారాంశం నేరుగా తలలోకి పోతుందని నమ్ముతారనుకుంటా, తమకు ఇంట్లో చదువుకునేందుకు ప్రశాంతమైన ప్రదేశం లేదని ఇక్కడికొచ్చి,ఇక్కడ ప్రశాంతంగా వుందని నిద్రపోతారు, చదువు సంగతి మర్చిపోతారు. పరీక్షల్లో తప్పి జీవనగమనం తప్పి ,మళ్ళీ ఇదే పార్కుల్లో శాంతి వెతుక్కుంటారు.

అందరిని మౌనంగా చూస్తూ ....మనుషుల్లో కనపడే అనేక భావాల్ని నేను చదువుతూ వుంటాను .నేను ఏళ్ళ తరబడి ఇదే పార్కులో సాయంత్రాలు గడుపు తున్నాను అప్పటి నుండి ఎంతో మంది జీవనపోరాటాలు పరిశీలిస్తుంటాను, ఈ పార్కు నాకిష్టమైన, నా జీవితంతో ముడిపడ్డ ఒక అద్భుత మైన ప్రదేశం . ఇప్పుడు ఈ బంధాన్ని వీడి వెళ్ళాల్సి వస్తోంది.

ఇన్నాళ్ళు నే పనిచేసిన ఎయిడేడ్ కాలేజ్ లో హిస్టరీ సబ్జెక్ట్ తీసివేశారు. ఒకప్పుడు రాయల్ గ్రూప్ గా చెప్పబడ్డ బియ్యే కి విద్యార్థులు లేరు . హిస్టరీ ,ఎకనామిక్స్,పాలిటిక్స్ గ్రూప్ ఎవరూ తీసుకోవడం లేదు . మెరిట్ విద్యార్థులందరూ ఇంజనీరింగ్, మెడిసిన్ లకే వెళుతున్నారు ,ఇంక ఎంసెట్ లో క్యాలిఫై అయిన వాళ్ళకు కూడా ఇంజనీరింగ్ సీట్లు వున్నాయి . ఇంకా అందులో క్యాలిఫై కాని వారిలో కూడా ముందు ఎమ్పీసి ,తర్వాత ఏమ్యీసి ,ఆ తర్వాత బీకాం కంప్యూటర్స్ ఆఖర్న ఏదీ రానివారు ముఖ్యంగా లెక్కలు, సైన్స్ చదివి ఎన్నో సార్లు ఇంటర్లో ఫెయిల్ అయిన వాళ్ళు బియ్యే అదీ ఎంతో బాధతో చేరుతున్నారు .వాళ్లకు ఇంటర్లో సిలబస్ కూడా చెప్పించి ఓ దారికి తెచ్చాక ఆ విద్యార్థులు నిజానికి తర్వాత గ్రూప్ వన్,గ్రూప్ టూ సర్వీసస్ లో ఉత్తీర్ణులై మంచి భవిష్యత్ అందుకున్నారు బ్యాంక్ ఉద్యోగాలు కూడా సంపాదించుకున్నారు. కానీ సాఫ్ట్ వేర్ ఉద్యోగాల మోజులో ధనం సంపాదన ధ్యేయంగా మొదలవుతున్న విద్యార్జన మనిషిని ఏ రకంగా తయారు చేస్తుంది? లోపబూయిష్టమైన విద్యావిధానం, వ్యవస్థ పై సరి అయిన అవగాహన లేని పాలకులు,అధికారులు, పిల్లల అభిరుచిని అర్థం చేసుకోలేని తలిదండ్రుల సంకుచిత స్వభావం, అన్నీ సంఘంలో ఇప్పుడున్న అస్తవ్యస్త స్థితికి కారణం అయారు.


పాతికేళ్ళ అనుబంధం ఈ కాలేజ్ తో నాకు . విద్యార్థులు చేరని కోర్సులన్నిటిని ఇప్పుడు ప్రభుత్వం తొలగించి, మా పోస్ట్ లను ఆధీన పరచుకుని గవర్నమెంట్ కాలేజ్ లలో ఖాళీలు వున్న చోటికి మమ్మల్ని బదిలీ చేస్తోంది ఇన్నేళ్ళు కలిసివున్న లెక్చరర్లమంతా ఎక్కడెక్కడికో వెళ్ళాల్సి వస్తోంది. అందరూ వెళ్ళిపోయారు. చివరిగా నాకు ఇపుడున్న చోటి నుండి దూరంగా వున్న ఒక పట్టణానికి బదిలీ అయింది. కాలేజ్ లో వీడ్కోలు తీసుకుని వచ్చాక గుండె బరువుగా వుంది.


"ఒక్కదానివి ఎందుకమ్మా ఇంకా వుద్యోగం చేయడం ? నా దగ్గరికో అన్నయ్య దగ్గరికో రావొచ్చు కదా! " అంది కూతురు. నవ్వి ఊరుకున్నా . ఇంకో పదేళ్ళు విద్యార్థులతో గడిపే అవకాశం పోగొట్టు కోవడమా ! మనిషి తన గొంతు వినేదానికే అధికంగా ఇష్టపడతాడట ... టీచర్ గంట మాట్లాడితే ఎదురు మాట్లాడకుండా వినేది విద్యార్థులు మాత్రమే ... ! ఆ అదృష్టం వుపాధ్యాయిలకే! యువతరంతో ఎక్కువ సమయం గడిపే అవకాశం కూడా వీరికే వుంది.


ఇల్లు ఖాళీ చేసి లారీలో సామాను పంపి వెనుక కార్లో బయలు దేరబోతూ పార్కు దగ్గర ఆగాను , అంతా కలయ చూసి తోట మాలి రంగన్న దగ్గరకు వచ్చాను . ఎప్పుడూ తోటే ప్రాణంగా చూసుకునే అతనంటే నాకు చాలా గౌరవం , పిల్లలతో, కుర్రాళ్ళతో , పెద్దవాళ్ళతో అందరితో నవ్వుతూ నవ్విస్తూ ఉంటాడు , వయసు పైబడుతున్నా అతనిలో పార్క్ పట్ల నిర్లక్ష్యం చూడలేదు , డబ్బు ఇస్తుంటే "ఎందుకమ్మా...ఇది .. చల్లగా వుండు తల్లి ... బాబు అమ్మను బాగా చూసుకోండి "అన్నాడు మా అబ్బాయితో . వాడు నవ్వుతూ తలూపాడు


పూల మొక్కల్ని ,చల్లని నీడనిచ్చే పెద్ద చెట్లను అపురూపంగా చూసుకుంటుంటే కళ్ళు మసక బారాయి . అభి నా బుజాల చుట్టూ చేతులు వేసి దగ్గరగా తీసుకున్నాడు. నా బాల్యం, చదువు, పెళ్లి , పిల్లలు ,అందమైన జ్ఞాపకాలన్న్తిటిని ఇచ్చిన ఈ ఊరిని ఈ పార్కును వదిలి వచ్చాను , మైలు రాళ్ళు ఒక్కొక్కటి పోతోంటే నేను ఏదో ప్రపంచపు దరిదాపులకు వెళుతున్నానని అనిపించింది .


తమ్ముడు లారీతో పాటు కొత్త ఇంటికి వెళితే, నేను, అభితో కాలేజ్ లో జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చేదానికి వెళ్లాను. కాలేజ్ చాలా పెద్దది స్టాఫ్ కూడా చాలా మంది వున్నారు. ప్రిన్సిపాల్ పరిచయం చేయగానే అందరు స్నేహపూరితమైన ముఖాలతో సాదరంగా ఆహ్వానించారు. అన్ని క్లాసులకు ప్రిన్సిపాల్ వచ్చి పరిచయం చేశారు. అయిదు ఆరు మంది విద్యార్థులు మాత్రమే వుండే క్లాస్ చూసిన నాకు నలభై దాటిన విధ్యార్థులున్న క్లాస్ లు చూస్తే ఆనందం కలిగింది. మొత్తానికి కాలేజ్ చాలా బావుంది . అభి నా ప్రక్క చూసి నవ్వాడు . అంటే కాలేజ్ నచ్చింది కదా అని అర్థం. నేను సంతోషం తో తలూపాను.


కొత్త ఇల్లు నేను చూడనే లేదు తమ్ముడు, అభి నే చూశారు. చిన్న ఇల్లు ,ఇంటి చుట్టూ కొబ్బరి చెట్లు, మొక్కలు వేసుకోవడానికి చాలా స్థలం వుంది. లారీ లో తెచ్చిన కుండీలన్నిటిని చక్కగా సర్ది పెట్టారు . "ఇల్లు చాలా బావుంది... మొక్కలకు స్థలం వుంది '" తమ్ముడ్ని అభినందనగా చూస్తూ అన్నాను. మామ అల్లుడు నవ్వుకున్నారు. "నీ టెస్ట్ మాకు తెలుసుగా " అన్నాడు . మేం ముగ్గురం, ఇద్దరు పనివాళ్ళు కలిపి ఇల్లంతా సర్డుకున్నాము . మధ్యాహ్నం కంతా సర్ది హోటల్ నుండి భోజనం తెచ్చుకుని తిని పడుకున్నాము . సాయంత్రం లేచి తమ్ముడు బయలుదేరాలి కదా అన్నది గుర్తొచ్చింది .వాడు తయారయివున్నాడు . "జాగ్రత్త... మళ్ళీ వారం కు పిల్లలతో కలిసి వస్తానులే 'అన్నాడు. తలూపాను . రాత్రికి అభి కూడా వెళ్ళిపోతాడు మనసు బాధగా మూల్గింది . "అమ్మా... అలా బయటికి వెళదామా !' అన్నాడు అభి .


"వద్దులే నాన్నా అలిసిపోయాం ! పైగా .. రాత్రికి నీవు వెళ్ళాలి కదా "అన్నా .


"వూరికే అలా వెళదాం.. చూద్దాం ఇక్కడ వూరు ఎలావుందో !' అభి అనడంతో బయలుదేరాం .


వీధి సందు మలుపు తిరగగానే పెద్ద పార్కు . "అరె ఇక్కడ కూడా పార్క్ వుంది .. " నా సంతోషానికి అవధులు లేవు. పార్క్ చాలా చాలా బావుంది .అక్కడి పువ్వులు, లాన్, పెద్ద చెట్లక్రింద బెంచీలు .... అభి నాకేసి చూసి


" ఎలా వుంది కాలేజ్ ,ఇల్లు ,పార్క్ ?" అన్నాడు


" చాలా బావున్నాయి...నేను ఊహించనే లేదు మంచి కాలేజ్, మంచి ఇల్లు, దగ్గరలోనే ఇంత అందమైన పార్క్ కూడా.. అన్నీ చూశావు కదా ఇల్లు పార్క్ కు దగ్గరలోనే వుండాలని " అభి చేయిపట్టుకుని మురిపంగా చూసుకుంటూ అన్నాను .


"అవునమ్మా... మనం భౌతికమైన కొన్ని సౌకర్యాలు ఏర్పర్చుకొగలం... అవి మన చేతుల్లో వున్నాయి అలాగే మన ఆలోచనా విధానం లోనే మన సంతోషం,శాంతి వుంది... ముందు నువ్వు పని చేసిన కాలేజ్ ను , ఆ ఇంటిని, ఎంతో కాలంగా వున్న స్నేహితుల్ని ,ఎన్నో ఏళ్లుగా రోజూ నీవు వెళ్ళే పార్క్ వదలాల్సి వచ్చినందుకు నీవు ఎంత నలిగావో గుర్తుందా !కానీ ప్రపంచమంతా ప్రజలే కదమ్మా ... మనం స్నేహ హస్తం అందిస్తే వెనకడుగు ఎవరూ వేయరు , ప్రజలకి పార్కులు కావాలి ,నర్సరీలు ,గుళ్ళు ,సినిమా హాళ్ళు ,హోటళ్ళు కావాలి, కాబట్టి ప్రతి వూర్లో అవి వుంటాయి . మనం ఏ అడ్రెస్ లో వున్నా మన మన:స్థితి ఒకేలా వుంటుంది . ఇక్కడి నుండి రెండేళ్లకు మళ్ళీ నీకు ట్రాన్స్ఫర్ కావొచ్చు ... అప్పుడు మళ్ళీ దీన్ని వదలడానికి నీవు బాధపడకూడదు . ఈ నిముషం లో ఇది నీది, రేపు గురించి ఆలోచించకు ... నీవు సంతోషంగా వుండాలమ్మా ... నీవు బాధపడితే నేను చూడలేనమ్మా ..". అభి గొంతులో నా పట్ల వున్న ప్రేమకు , కన్సెర్న్ కు కదిలి పోయాను ... అదే నిముషం లో వాడు చెప్పిన సిద్దాంతం అమలు అంత సులభమా ! ఇప్పటి యువతరం మా తరం కంటే... గొప్పగా ఆలోచిస్తున్నారా ... ! మా తరం లోని సెంటిమెంట్స్ అంత విలువ లేనివా ! కానీ అభి చెప్పింది నిజమే ... ప్రపంచం ప్రేమ మయం... ఇస్తుంటే వస్తుంది , " అభిని కళ్ళతోనే మెచ్చుకుని భుజం తట్టా . రాత్రి అభి తన ఉద్యోగ ధర్మం కోసం వెళ్ళిపోయాడు . అమెరికాలో హడావుడిగా ఆఫీసుకు వెళుతున్న కూతురు అని తో కాసేపు ఫోన్లో మాట్లాడి పడుకున్నా .


ఉదయం క్లాస్ లో వున్న నన్ను ప్రిన్సిపాల్ పిలిపించారు ... "సారీ మేడం ముందున్న హిస్టరీ మేడం కోర్ట్ నుండి స్టే తెచ్చారు ... రిటైర్ అయేముందు ట్రాన్స్ఫర్ చేయకూడదని ... మీరు కమీషనర్ ఆర్డర్స్ వచ్చేవరకు వెయిట్ చేయాలి ... మీకు ఎక్కడ ఇస్తారో మరి, పాపం... నిన్ననే వచ్చారు , ముందయినా తెలిసివుంటే ,జాయిన్ కాకుండా వుండేవారు , మళ్ళీ ఎక్కడ వేస్తారో! మళ్ళీ ఇల్లు వెతుక్కోవడం ... అంతా పెద్ద ప్రయాస .. ఏంటో ఇలాగ జరిగింది ." సంజాయిషీ గా అన్నాడు


"పర్లేదు సర్... ఇది జీవన గమనం...మన ఉద్యోగాలు అంతేకదా ! ఎక్కడకు వేస్తే అక్కడికి వెళతాను ... " మనసులో కొంచం కూడా కల్లోలం లేకుండా ప్రశాంతంగా ఇంటికి వచ్చి పడుకున్నా. ఆర్డర్స్ వచ్చేవరకు చాలా చదవాల్సిన పుస్తకాలున్నాయి .. అన్నీ చదివేయాలి . అనుకుంటూ .


--

ప్రచురణ: జాబిల్లి, డిశంబర్ 2016

ది కాచర్ ఇన్ ది రై


ఇటీవల ఇంగ్లీష్ నుండి తెలుగు అనువాదంలో వచ్చిన జె. డి శాలింజర్ “ద కాచర్ ఇన్ ద రై” నవల చదివాక, అందులోని సారాంశం పూర్తిగా అర్థమైంది. అంతకు ముందు ఇంగ్లీష్ లో చదివినా ఇంత విపులంగా అర్థం కాలేదు. చదివాక నవలపై వ్యాసం రాయాలనిపించింది . రాసింది ఇంగ్లీష్ ,తెలుగు పెద్దగా రాని 24 ఏళ్ల టామ్ సాయర్ అనే కుర్రాడంటే ఇంకా ముచ్చటేసింది . ఇది చదివాక ఆ కుర్రాడికి ఇంగ్లీష్ , తెలుగు పెద్దగా రాదంటే వొప్పుకోలేం. శాలంజర్ భాషను అద్భుతమైన రీతిలో తెలుగులో అనువదించాడు.జె.డీ శాలంజర్ అనగానే అతని వివాదాస్పదమైన నవల“ద కాచర్ ఇన్ ద రై “ (1951) గుర్తొస్తుంది. అతనింకా కొన్ని కథలు నవలలు రాసినప్పటికీ ఈ నవలే అందరికీ గుర్తుంది.దీని తోటే పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. అమెరికాలో మాన్ హట్టన్లో 1910లో జనవరి 1 న జన్మించిన శాలింజర్ చిన్న వయసులోనే రచనావ్యాసంగం మొదలెట్టాడు. జీవితంలో ఎక్కువ కాలం అజ్ఞాతంలోనే గడిపిన శాలింజర్ 1965 లో చివరి రచనను ప్రచురించాడు, 1980లో చివరి ఇంటర్వూ ఇచ్చాడు. 2010లో అజ్ఞాతంలోనే మరణించాడు


రచయిత జె.డి శాలింజర్ ఆత్మకథగా చెప్పబడే ఈ నవల ఒక గొప్ప క్లాసిక్ (కళా ఖండంగా) ఇప్పుడు చెప్పబడుతున్నా , ఒకప్పుడు ఇది అమెరికాలో చాలా విద్యాలయాలలో నిషేదింప బడిన పుస్తకం. అయితే ఇది ఆ కాలం నాటి యువతను ఎక్కువ ఆకర్షించింది. శాలింజర్ 32 ఏళ్ల వయసులో 1951 లో ఈ పుస్తకం రాశాడు. "కాచర్ ఇన్ ది రై "నవల బిల్దంగ్స్ రోమన్ అనే సాహితీ ప్రక్రియలో రాయబడ్డది . ఈ పద్ధతిలో రాయబడ్డ నవలలో ప్రధాన పాత్రధారి బాల్యం నుండి పరిపూర్ణుడిగా ఎదగడం జరుగుతుంది. అయితే బిల్దంగ్స్ రోమన్ నవల విధానంలో కథానాయకుడిలా ఇక్కడ హొల్దన్ ఎదగడానికి ఇష్టపడడు, పైగా ఎదగడానికి నిరాకరిస్తాడు. నవల అంతా కౌమారదశలో పదహారేళ్ళ వయసులో వున్న హొల్దన్ ఒంటరితనం గురించి , అతను ఎలా అమాయకత్వం నుండి దూరమయాడో ఆ దశలో వుండే అందరు పిల్లలు ఎలా అదే రకమైన నైరాశ్యంలో మునిగి పోయారో వివరిస్తాడు. హొల్దన్ కాల్ఫీల్ద్ ను అచ్చంగా శాలింజర్ తనకు ప్రతిరూపంగా సృష్టించాడు. పెన్సిల్వేనియా రాష్ట్రం లోని ,ఏగర్స్ టవున్ లోని పెన్సి పెప్ అనే బోర్డింగ్ స్కూల్లో సరైన ప్రతిభను చూపలేని హోల్డన్ , ఫుట్ బాల్ మ్యాచ్ కు వెళుతూ టీమ్ మానేజర్ గా వుండి కూడా నిర్లక్ష్యoగా కిట్ ను సబ్వేలో పోగొట్టి అందరి ఆగ్రహానికి గురయ్యి ఆట ఆడకుండానే తిరిగి వస్తాడు. అదీకాక అతను నాలుగు సబ్జెక్ట్స్ తప్పాడు కాబట్టి స్కూలు నుండి తరిమేస్తే న్యూ యార్క్ లో అక్కడా ఇక్కడ తిరుగుతూ రోజంతా గడుపుతూ తన ఆలోచనలను పాఠకులతో పంచుకోవడమే నవలలో జరిగేది.


65 మిలియన్ల కాపీలు అమ్ముడు పోయి , ప్రపంచంలోని అన్ని బాషల్లోకి అనువదించబడిన ఈ పుస్తకం ఒక ప్రభంజనం సృష్టించింది. కౌమారంలో వున్న బాలలంతా హొల్దన్ ను తమ ప్రతినిధిగా భావించారు. ఈ నవలకు ఆతరంలోని బాలలంతా ఎంతో ప్రభావితులయ్యారు . నవల ఆ రోజుల్లో వున్న సంక్లిష్టమైన కొన్ని సమస్యల్ని గురించి చర్చించింది. ముఖ్యంగా పిల్లల్లో అమాయకత్వం కొరవడ్డం, గుర్తింపుకై ఆరాటం, ప్రేమ రాహిత్యం, లోపబూయిష్టమైన విద్యావిధానం, పిల్లలకు పెద్దలకు మధ్య పెరిగే ఎడం, అసహజ సెక్స్ సంబంధాలు, నవీనత పేరుతో చెడిపోతున్న మానవ సంబంధాలు, ఉజ్వలమైన భవిష్యత్తు పేరిట స్కూళ్ళలో పిల్లలపై పడుతున్న ఒత్తిడి, రెసిడెన్షియల్ స్కూళ్ళ పేరిట నిర్భంద విద్య మొదలైనవి. పుస్తకాన్ని పెద్దలు విద్యావేత్తలు ముఖ్యంగా పాఠశాల నిర్వాహకులు, ఉపాధ్యాయులు దీన్ని నిషేదించాలని పట్టుపట్టారు. అయినా ఈ నవల తన జైత్రయాత్రను కొనసాగించింది. ఇప్పటికి ఈ పుస్తకం ప్రతి ఏడూ 250,000 కాపీలు అమ్ముడవుతోంది. టైం 2005 లో ఇచ్చిన నివేదికలో ఈ నవల 1923 నుండి విడుదల అయిన 100 గొప్ప పుస్తకాల జాబితాలో చోటు చేసుకుంది. మోడ్రన్ లైబ్రరి 20 శతాబ్దంలో ఇంగ్లీషు భాషలో వచ్చిన 100 పుస్తకాల్లో ఒకటిగా ఈ నవలను చేర్చింది . రియలిస్టిక్ ఫిక్షన్ గా చెప్పబడే పంధాలో ఈ నవల నడుస్తుంది.


ఏ సాహితీ ప్రక్రియ అయినా అందులోని విషయం (థీమ్ ) గురించే ప్రధానంగా మేధావుల మధ్య చర్చించబడుతుంది. “ ద కాచర్ ఇన్ ది రై” నవలలో హొల్దన్ బాల్యానికి యవ్వనానికి మధ్యన సంధి స్థితిలో కౌమారంలో ఉంటాడు . ఈ నవల పేరు కు అర్థం "పిల్లలను అమాయకత్వం పోగొట్టుకోకుండా కాపాడడం “అని హొల్దన్ వివరిస్తాడు. మిగతావాళ్ళనుండి వేరుగా వుండడాన్ని (alienation ), తనను కాపాడుకోవడానికి ఒక సాధనంగా హొల్దన్ వాడుకుంటాడు . నవల ఆద్యంతమూ హొల్దన్ తన చుట్టూ వున్న ప్రపంచం వలన బాధితుడు కావడమే కాకుండా తనకు నచ్చిన విషయాల నుండి కూడా వేరు చేయబడ్డo మనం గమనించవచ్చు. ఇదే నవలలో ప్రధాన విషయం/వస్తువు. దీనికి అనుబంధంగా విద్యావ్యవస్థ, సామాజిక పరిస్థితులు, మనస్తత్వ పరిశీలన లాంటివి నవలలో ప్రధాన పాత్ర పోషిస్తాయి.


హోల్డన్ కు కుటుంబం అంటే ఎంతో ఇష్టం, హాలీవుడ్ లో సినిమాలకు పనిచేసే అన్న డి. బి, చనిపోయిన తమ్ముడు అల్లే , ఫోబ్ అనే చిట్టి చెల్లెలంటే ఎంతో ప్రాణం. అంతే కాదు కుటుంబంతో గడపడం హోల్డాన్ కు ఎంతో బాగుంటుంది. కానీ హోల్డన్ ను బోర్డింగ్ పాఠశాలలో (మనం ఈ నాడు పిలుచుకునే రెసిడెన్షియల్ పాఠశాలలు) చేర్పించారు. అప్పటికే మూడు రెసిడెన్షియల్ పాఠశాలలు మారిన హోల్డన్ మళ్లీ ఇప్పుడున్న పాఠశాల నుండి తరిమివేయబడితే తల్లిదండ్రులు బాధపడ్డమే కాకుండా తనకు శిక్ష విధిస్తారని భయపడతాడు, బాధపడతాడు. అయితే నవల ఆరంభంలోనే తన తల్లిదండ్రుల్లో వుండే లోపాల్ని, అవి తనకు నొప్పి కలిగించినవి అయినప్పటికీ హొల్దన్ చెప్పడానికి ఇష్టం లేదంటాడు. ఎందుకంటే అవి చెబితే తన తల్లిదండ్రులు నొప్పిపడతారని అంటాడు. ఈ సంస్కారం హోల్డన్ కు వుండడం మనం గమనించవచ్చు. తల్లిదండ్రులు లేని సమయంలో స్కూల్ నుండి పారిపోయి రహస్యంగా ఇంటికి వచ్చిన హొల్దన్ తో "నిన్ను చూస్తే నాన్న చంపేస్తాడు” అని హోల్డన్ చెల్లెలు ఫోబ్ పదేపదే అంటుంది. భారత దేశం లో- అదీ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న చరిత్ర లాగా అనిపిస్తోంది కదా! నిజమే. విద్యావ్యవస్థ పసిపిల్లల మనస్తత్వంపై పెను ప్రభావం చూపుతుందనే సత్యాన్ని మనో విశ్లేషకులు ఏనాడో చెప్పారు. తల్లిదండ్రుల పెంపకం, గురువుల బోధన, స్నేహితులు, చుట్టూ వున్న సామాజిక, ఆర్థిక,సాంసృతిక పరిస్థితులు ఒక చిన్నాoరి కి వ్యక్తిత్వం ఏర్పడడంలో ప్రభావం చూపుతాయి ఇవి కాక వ్యక్తి తానుగా కూడా తన వ్యక్తిత్వాన్ని పెంపొందింప చేసుకుంటాడు. ఇప్పుడయితే ఇవి కాక, పిల్లలపై సినిమాలు, ఇంటర్నెట్, సెల్ ఫోన్, వాట్స్ ప్ లాంటివి కూడా ఎక్కువ ప్రభావం చూపుతున్నాయి .


వందేళ్ళ క్రితం పశ్చిమ దేశాల్లో వున్న రెసిడెన్షియల్ స్కూల్ పద్ధతి, క్రమశిక్షణలు, శిక్షలు, బలవంతపు చదువులు, అట్లాంటి చడువులతోనే భవిష్యత్తు ఉంటుందనే తల్లిదండ్రుల నమ్మకం లాంటివి నవల ప్రారంభంలోనే గమనించవచ్చు . వ్యాపార సంస్థలుగా మారిన విద్యాలయాల గురించి హోల్డన్ త్రీవ్రంగా విమర్శిస్తాడు. ఏకంగా నవల హొల్దన్ వ్యక్తిగత అభిప్రాయం కావొచ్చు. కానీ అది ఆనాటి విద్యావ్యవస్థ లో లోపాల్ని ,తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల నిరoకుశవైఖరినీ తేటతెల్లం చేస్తుంది. తమ ప్రేమ కంటే స్కూల్ లోని వ్యవస్థ, యాజమాన్యం పెట్టె క్రమశిక్షణతో తమ పిల్లల జీవితాలు బాగుపడతాయని తల్లిదండ్రులు ఆశించినట్లు మనకు నవలలో హోల్డన్ ఆవేదన వెల్లడి లో అర్థమవుతుంది .తమ జీవితంలో కానీ ఉద్యోగ నిర్వహణలో కానీ ఉపయోగపడని చదువులతో ఆనాటి అమెరికన్ విద్యావవస్థలో రావాల్సిన సంస్కరణల్ని రచయిత ఒక బాధితుడైన హోల్డన్ ద్వారా చెప్పకనే చెప్పిస్తాడు. తనకు ఏ మాత్రం ఆసక్తి కలిగించని చరిత్ర గురించి చదవడం, రాయడం హొల్దన్ కు నరకం లాగా వుంటుంది . కొందరు మంచి హృదయమున్న ఉపాధ్యాయులు కూడా విద్యను బలవంతంగానైనా నేర్పే ప్రయత్నం లో హొల్దన్ కు దూరమవుతారు. స్పెన్సర్ అనే వుపాధ్యాయునితో "తాను జీవితానికి మరొక ప్రక్క చిక్కుకు పోయా"నంటాడు హొల్దన్. అందుకే తాను బందీ అయిన ప్రపంచపు సంకెళ్ళ నుండి తప్పించుకునేందుకు నిరంతరం ప్రయత్నిస్తుంటాడు.


హోల్డన్ అతను చదువుకున్న స్కూల్ పెన్సి ప్రెప్ యాజమాన్యం ఇచ్చుకునే ప్రకటనలు గురించి చెప్పడం మనదేశంలో ఇప్పుడున్న పాఠశాలలు ఇచ్చే ప్రకటనలు గుర్తు చేస్తాయి. ” పెన్సి ప్రెప్ స్కూల్ గురించి వేయి పత్రికల్లో ప్రకటనలు ఇవ్వడం వలన ఆ స్కూల్ చాలా మందికి తెలుసు. ఆ ప్రకటనలో అందమైన అబ్బాయి గుర్రo మీద కూర్చుని కంచె దాటు తున్నట్లు వుటుoది. పిల్లలు పోలో ఆడుతున్నట్లు కూడా ఉంటుంది కానీ స్కూల్లో ఒక్కసారి కూడా ఒక్క గుర్రాన్ని కూడా చూడలేదంటాడు హోల్డన్. మన దేశంలో కూడా ఇంటర్నేషనల్ స్కూళ్లలో ఇలాంటి ప్రకటనలే మనం చూస్తాం . ఆ ప్రకటనల్లో నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో ఈ ప్రకటనల్లో అంత నిజం ఉంటుంది. ఆ రోజుల్లో ఆ ప్రకటనలు చూసి హోల్డన్ ను ఆ స్కూల్లో చేర్పించిన అతని తల్లిదండ్రులు ఎంత నిరాశకు లోనయ్యారో హోల్డన్ చెబుతాడు. ఇలాంటి ప్రకటను చూసి మన దేశంలోని తల్లిదండ్రులు ఎంతమంది హోల్డన్స్ ని తయారు చేస్తున్నారో… ఎవరికి తెలుసు? ఒకప్పుడు అమెరికాలో వున్న పద్ధతులకు బలయిన విద్యావ్యవస్థను వాళ్ళు సంస్కరించుకుని ఇప్పుడు పిల్లల హక్కుల్ని కాపాడడమే కాకుండా వాళ్ళ బాల్యాన్ని రక్షించే విద్యావ్యవస్థను ఏర్పర్చుకుంటుంటే మనం పిల్లల బాల్యాన్ని హరించే జైళ్ల లాంటి స్కూళ్లను ప్రోత్సహిస్తున్నాము. మన స్కూళ్ళు విద్యార్థులను డాక్టర్లుగా ఇంజనీర్లుగా తయారు చేసే కర్మాగారాలుగా తయారయ్యాయి కానీ పిల్లల అభిరుచికి , ఆసక్తికి తగిన ప్రొత్సాహం ఇచ్చే విద్యాబోధన ఇక్కడ జరగడం లేదు .


హొల్దన్ ఎప్పుడూ ఎరుపు రంగు హంటింగ్ హ్యాట్ ధరిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటాడు. హొల్దన్ మిగతా వారిలాగా కాకుండా తన కొక ప్రత్యేకత వుందని భ్రమిస్తాడు అందుకే అందర్నీ వదిలి ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడతాడు. సత్యమేమిటంటే అతను ఎవరితోనైనా మాట్లాడినప్పుడు అయోమయంలో ఇబ్బంది పడతాడు. తాను ప్రత్యకమైన వ్యక్తినని భావించడం వలన అది అతని ఆత్మ రక్షణ కవచంలా భావిస్తాడు .ఇదే అతనిలో కొంచం స్థిరత్వాన్ని కలిగిస్తుంది. నిజానికి అతని ఏకాoతమే / ఒంటరితనమే అతని బాధలకు కారణం , అతని భావాల్ని ఎప్పుడూ నేరుగా విప్పిచెప్పడు. అంతేకాదు తన సమస్యలకు కారణం కూడా అతను గ్రహించడు. అతనికి మానవ సంబంధాలు కావాలి, ప్రేమ కావాలి. అయితే అతను ఏర్పరచుకున్న అహం అడ్డుగోడలు అతన్ని ఏ సంబంధాలను గౌరవించనివ్వవు, ఏర్పర్చుకోనివ్వవు. అతని ఏకాంతమే అతని బలంగా ఒకసారి, అదే అతని సమస్యలకు కారణం అవుతుంటుంది. ఉదాహరణకు అ ఒంటరితనం అతన్ని స్యాలి తో డేటింగ్ కు ప్రేరేపిస్తుంది అంతలోనే ఒంటరిగా ఉండాలనే కోరికతో ఆమెను అవమానిస్తాడు. దాంతో ఆమె అతన్ని వదిలేసి వెళుతుంది అలాగే జేన్ తో ఒకప్పుడు వున్న స్నేహాన్ని పునరుద్ధరించుకోవాలని ఎంతో అనుకుంటాడు కానీ ఆమెను కలుసుకునేందుకు ఏ రకమైన ప్రయత్నం చేయడు. అతనెక్కువ ప్రేమించే అతని ఏకాంతమే అతన్ని నాశనం చేస్తుంది .


హొల్దన్ నాచురల్ హిస్టరీ మ్యూజియం వెళ్ళాక జీవరాశుల గురించి తెలుసుకోగానే అతనికి మార్పు అంటేనే భయం వేస్తుంది. మరీ అతనికి జీవితంలోని సంక్లిష్టతను భరించలేకపోతాడు. అతనికి ప్రతీదీ చాలా సులభంగా అర్థం కావాలని కోరుకుంటాడు ఏదీ మార్పుకు లోను కాకూడదని ఎలా వుండేది అలాగే వుండాలని,మ్యూజియంలో వున్న బొమ్మ ఎస్కిమోలలా, అమెరిన్డియన్ లా వుండాలని అతను తీవ్రంగా వాంఛిస్తాడు. హొల్దన్ ఎక్కువ భయపడతాడు కూడా, అపరాధభావాలతో, పాపభీతితో కూడా ఉంటాడు ఎందుకంటే ఇతరులలో అతను విమర్శించే తప్పులు అతనిలో వున్నాయి. అయితే దాన్ని అతను అంగీకరించడు. కొన్ని సార్లు మాత్రమే అతను దాన్ని అంగీకరిస్తాడు. ఉదాహరణకు చాప్టర్ 9 లో” నాకు సెక్స్ అంటే తెలియదు దేవుడి మీద ప్రమాణం చేసి చెబుతున్నా నాకు నిజంగా సెక్స్ అంటే తెలియదు” అంటాడు .


ఎదగడం అనేది తనను భయపెడుతుందని,అయోమయంలో పడేస్తుందని చెప్పడానికి బదులు హోల్డన్ పెద్దరికం అంతా సారం లేనిదని, పైకి ఒకటి లోపల ఒకటి చూపే నైజం కలదని (దీన్నే నవలలో ఎప్పుడూ ఫోనీనెస్ గా అంటాడు),పసితనం అంతా అమాయక ప్రపంచం, కుతూహలం, నిజాయితి కూడుకున్నదని అంటాడు. అతను పసితనాన్ని ఒక అద్భుత లోకంగా అక్కడ పిల్లలు అవధులు లేని ఆటపాటలలో ఉంటారని, ఎదగడం అనేది పిల్లలకు మరణంతో సమానమని , ఎదగడం అన్నది అత్యున్నత పర్వతం నుండి అఘాతంలోకి పడిపోవడం అని హొల్దన్ భావన. పసితనం, ఎదగడంలపై హొల్దన్ కున్న అపోహల వలన అతను తనకు తానే ఏర్పరచుకున్న ఒక తెరను కప్పుకున్నాడు.


హోల్డన్ ఎప్పుడూ పెద్దలపై తన క్రూరమైన విమర్శలు కురిపిస్తాడు. కానీ త్వరలోనే మిస్టర్ అన్టోలిని, అతని చెల్లెలు ఫోబేతో అతని అనుభవాలు అతని స్థిరత్వంలేని వ్యక్తిత్వంలోని డొల్లతనాన్ని చూపిస్తాయి. నవలలో ఫోనినెస్ అనే పదం శాలంజర్ ఎక్కువ వాడతారు. ఆ పదo పెద్దల్లో వున్న హిపోక్రిసీ, నటన, డొల్లతనాన్ని గురించి చెప్పడానికి వాడతాడు. 22 వ చాప్టర్లో పెద్దవాళ్ళ గురించి చెబుతూ వాళ్ళను ఫొనీనెన్ కు ప్రతీకలుగా, ప్రపంచంలోని చెడుకు ప్రతీకలుగా చెబుతాడు. తాను ఒంటరి తనం ఎన్నుకోవడానికికూడా ఫోనీ నెస్ ను కారణంగా చెబుతాడు . అలాగని హొల్దన్ పెద్దవాళ్లపై చేసిన అభియోగాలన్నీ సత్యదూరాలని అనుకోవడానికి వీల్లేదు. అతని సూక్ష పరిశీలన చాలా మంది పెద్దవాళ్ళ విషయంలో చాలా నిజం. సాల్లీ హేయస్, కార్ల్ లూస్ , మారిస్ మరియు సన్నీ , స్పెన్సర్ కూడా ఈ విషయంలో ఉదాహరణలుగా నిలుస్తారు. మారిస్ మరియు సన్నీ నిజంగానే చాలా ప్రమాదకరంగా కనిపిస్తారు. అయితే ఇతరులలోని లోపాల్ని ఎత్తిచూపడానికి హొల్దన్ ఎంతో శక్తియుక్తులు ఉపయోగిస్తాడు. కానీ తనలోని లోపాల్ని అతను గమనించడు. అతని అభియోగాలన్నీ నిజం కావు. కొన్ని ఎంత హేతురహితంగా ఉంటాయంటే అవి ఎంతో అవాస్తవమైనవి అంతేకాదు క్రూరమైన అభియోగాలు కూడా . ఇవే అతన్ని అపద్దం చెప్పే వ్యక్తిగా తయారు చేస్తాయి . న్యూ యార్క్ కు హోల్డన్ వెళ్లేప్పుడు శ్రీమతి మారో తో అతని ప్రవర్తన ఏమాత్రం నిజాయితీ లేనిది . చెడు, నిజాయితీ లేనితనం ,ఫోని నెస్ నిండిన ప్రపంచం అని విమర్శించే హోల్డన్ తాను మాత్రం మంచితనానికి మారుపేరుగా చెప్పుకున్నాడు.నిజానికి అతనిలో కూడా ఏమీ నిజాయితీ లేదని మనకు తెలుస్తుంది .


హోల్డన్ నమ్మకం ఏమిటంటే ప్రపంచం ఒక అందమైన ప్రదేశం అందులో మంచితనం అమాయకత్వం ఒక ప్రక్కవుంటే మరొక ప్రక్క, హిపోక్రిసీ, డొల్లతనం, ఫొనీనెన్ ఉన్నాయని. దీనికి హోల్డన్ ఒక ప్రతికూల సాక్ష్యం. అయితే అతను చూసిన విధంగా, కోరుకున్న విధంగా ప్రపంచం అందమైంది కాలేదు, ప్రజలపై మంచి చెడు తీర్పు ఇచ్చినట్లు, ప్రపంచం గురించి అతని తీర్పు అన్ని వేళలా ,అన్ని సందర్భాలలో , అందరి విషయంలో నిజం కాజాలదు .


నవలలో హోల్డన్ ఒంటరితనం అతన్ని ప్రపంచం నుండి వేరు చేసి ఏకాకిని చేస్తాయి. నవలకు అదే మూలం. నవల మొత్తం అతను సాహచర్యం కోసం చేసే ఉన్మాదపు వెతుకులాట, ఒక మతి లేని ప్రయత్నం నుండి మరొక మతిలేని ప్రయత్నం ముఖ్యమైన చర్చలుగా ఉంటాయి. అయితే అతను ఎప్పుడూ ఆత్మ పరిశీలన చేసుకోడు. అందువలనే అతను ఎప్పుడూ ప్రపంచాన్ని విమర్శనాత్మకంగానే చూస్తుంటాడు, దాన్నే తనను తాను రక్షించుకునే కవచంగా భావిస్తుంటాడు, మళ్లీ తన ఒంటరితనాన్ని పోగొట్టుకునే ప్రయత్నం తీవ్రంగానే చేస్తాడు. తన కారణంగానే అందులో ఓడిపోతాడు,అదే అతని బాధ, అదే అతని గెలుపు, అదే అతని ఓటమి.


అతని భౌతిక, మానసిక సంబంధాలు అతన్ని కొంచం ప్రపంచంలోకి తేవడానికి ప్రయత్నం చేస్తాయి . అయితే అవి పెద్దల అలవాట్లుగా,సంక్లిష్టత ,సంఘర్షణ కలవిగా ,ఎప్పుడూ మారిపోయే విషయాలుగా అనిపించి మళ్లీ వాటిని చేరడానికి హోల్డన్ భయపడతాడు. అతనికి న్యాచురల్ హిస్టరీ మ్యూజియంలో వున్న విధంగా ప్రపంచం స్థిరంగా, సాదాగా, స్తంభించిన విధంగా, నిశ్శబ్దంగా, మార్పు లేకుండా ఉండాలని కోరుకుంటాడు. అతని చెల్లెలు ఫోబ్ కూడా హోల్డన్ ఊహించినంత అమాయకంగా ఉండదు. ఎందుకంటే ప్రజలెలా వుంటారో ఎలా ప్రవర్తిస్తారో… ఎవరూ ఊహించలేరు. వాళ్ళు ఇంకా హోల్డన్ ఆత్మ విశ్వాసాన్ని, ఆత్మ బలాన్ని ప్రశ్నిస్తారు . హోల్డన్ తమ్ముడు అల్లే మరణం తర్వాత అతనిలో కొంత అనిశ్చిత మనస్తత్వం పెంపొందింది . ప్రాణంగా వున్న తమ్ముడి ఆకస్మిక మరణం, అదృశ్యం అతని బాల్యంలో ఒక అర్థం కానీ ప్రకృతి వైపరీత్యం . దాంతో అతను ఎవరికీ చేరువ కాలేని స్థితికి చేరుకున్నాడు. తన చుట్టూ ఎవరూ ఛేదించలేని ఒక విపరీతమైన, విచిత్రమైన మానసిక కవచాన్ని ఏర్పరచుకున్నాడు. అయినా ప్రతి క్షణం ఆ కవచం నుండి రావడానికి కొత్త ప్రేమ బంధాల్ని , స్నేహ సంబంధాలను పెంచుకోవడానికి ప్రయత్నిస్తాడు .


అపద్దాలు చెప్పడం ,మోసపూరితమైన పనులు చేయడం ఆత్మవంచనతో కూడుకున్నవి , దీన్నే పదేపదే ఫోని నెస్ గా హోల్డన్ చెబుతాడు. హోల్డన్ కూడా ఈ రెండు పనులు చేసినందుకు సిగ్గుపడతాడు. తానుకూడా హిప్పోక్రటిక్ గా మారడం సత్యమని అంగీక రిస్తాడు .


పుస్తకం పేరును శాలింజర్ రాబర్ట్ బర్న్ రాసిన ఒక పాట “కమింగ్ త్రూ ద రై “ నుండి తీసుకున్నాడు . ఈ పాట ఈ నవలకు ఆయువు వంటిది. హోల్డన్ 16 వ చాప్తర్ లోనే ఈ పాట పాడుకుంటూ పిల్లలు సహజంగా చేసినట్లే వీధికి ప్రక్కగా నడవకుండా (అదే ఫుట్ పాత్ మీద నడవకుండా ) వీధి మధ్యలో నడుస్తూ పోతాడు . మళ్లీ ఫోబ్ నీ జీవిత లక్ష్యం ఏమిటని అడిగినప్పుడు “కమింగ్ త్రూ ద రై “పాటలో అతను ఊహించుకున్న దృశ్యాన్ని వివరిస్తాడు. ఆ దృశ్యంలో “ఒక గోధుమచేలో ఎత్తైన కొండ దగ్గర పిల్లలంతా ఆడుకుంటూ పాడుకుంటూ ఎగురుకుంటూ గుమిగూడివున్నారు. వాళ్ళు ఎత్తైన కొండమీద వున్నారు కాబట్టి వాళ్ళు పడిపోకుండా పట్టుకొని కాపాడాలని” అతను ప్రయత్నిస్తాడు. ఆ పాటలో “ఇఫ్ ఎ బాడీ కాచ్ ఎ బాడీ కమింగ్ త్రూ ద రై “ అని హోల్డన్ పాడుకుంటాడు. కానీ అంతలోనే ఫోబ్ రాబర్ట్ బర్న్ పాటలో “ఇఫ్ ఎ బాడీ మీట్ ఎ బాడీ కమింగ్ త్రూ ద రై “.అని సరి చేస్తుంది. మీట్ (కలుసుకోవడం ) అని కాకుండా కాచ్ (పట్టుకోవడం) అన్న పదం హోల్డన్ వాడడంలో అమాయకత్వం అనే ఎత్తైన కొండల అంచులపై ఆడుకుంటున్న పిల్లల్ని “పట్టుకుని” (కాచ్ )పెద్దల జ్ఞాన ప్రపంచం అనే లోయలోకి పడిపోకుండా కాపాడ్డం అని అర్థం స్ఫురిస్తుంది.


హోల్డన్ తాను మారుతున్నాడు తప్ప నాచురల్ హిస్టరీ మ్యూజియంలో ఏవీ మారడం లేదు. అతనెన్ని సార్లు వచ్చినా మ్యూజియంలో అదే స్థితి ఉంది. అతని ఊహల్లో వున్న ప్రపంచంలో మార్పు లేదు, ఇక్కడా లేదు. అందుకే హోల్డన్ ఆ మ్యూజియంను అంత ఇష్టపడతాడు. అతనికి ఎప్పుడూ ఊహించని విధంగా మారే వాస్తవిక ప్రపంచం అంటే ఇష్టం లేదు. ఎందుకంటే ఆ ప్రపంచంలో ఊహించని ఎన్నో దారుణాలు ,మార్పులు జరుగుతాయి, హోల్డన్ కు ప్రియమైన అల్లే మరణం వలన ప్రపంచంలోని ఏ ప్రేమను కోరుకున్నా దాన్ని త్వరలో కోల్పోతానేమో అన్న భయంతో, ముందే ఆ బంధాల నుండి దూరం పోతాడు, ప్రేమలకు భయపడతాడు.


హోల్డన్ ఎప్పుడూ సెంట్రల్ పార్క్ లాగూన్లోని బాతులు చలికాలంలో ఎక్కడికి పోతాయో అని ఆలోచిస్తుంటాడు. ఈ ఆలోచన అతని లోని స్వచ్ఛమైన పసితనాన్ని సూచిస్తుంది అంతేకాదు మిగతా విషయాల్లో అతని ఆలోచనలు అంత ఆరోగ్యకరంగా ఉండవు. ప్రపంచంపై అతని కోపం ప్రతి విషయం లోను కనపడుతుంది ఒక్క బాతులగురించి తప్ప . బాతుల గురించి మాట్లాడినప్పుడు అతను విశ్వంలోని మర్మాల్ని తెలుసుకునే ఆసక్తిని కనపరుస్తాడు . ఇంకా మిగతా ఏ విషయం లోను అతను కుతూహలాన్ని ప్రదర్శించడు. అంతే కాక బాతులు మరొక కోణంలో గొప్ప జీవన సత్యాన్ని , ప్రకృతి రహస్యాన్ని కూడా హోల్డన్ కు పాఠకుడికి కూడా బోధిస్తాయి . కొలను లోని పట్టుదల గల బాతులు తమకు అనుకూలంగా లేని వాతావరణాన్ని వదిలి అదృశ్యం అయిపోతాయి మళ్లీ అనుకూలంగా మారగానే వచ్చేస్తాయి. విశ్వంలో కొన్ని మార్పులు అశాశ్వతమైనవి, అనివార్యమైనవి కూడా. ఇవి నిజానికి హోల్డన్ కు ఒక మంచి పాఠం చెబుతున్నాయి.అయితే తమ్ముడి అల్లే మరణం, అదృశ్యం అతన్ని త్రీవ్రంగా గాయపరిచాయి. అంతేకాదు జీవితం లోని ఆస్థిరతను, మార్పును, మరణంలో మర్మాన్ని అవి చెప్పకనే చెప్పాయి. అయితే అన్ని విషయాల్లో మార్పు శాశ్వతం కాదని, అది చక్రభ్రమణం కలిగి ఉంటుందని ,చలికాలం అదృశ్యం అయే బాతులు మళ్లీ వసంత ఋతువుకు తిరిగి వస్తాయని అందరూ గ్రహించాలని రచయిత అభిప్రాయం. కొలనులో నీళ్లు చలికాలం గడ్డకడతాయి, వసంతకాలం రాగానే కరుగుతాయి ఈ ప్రపంచం కూడా కొలను లాగానే “సగం గడ్డ కట్టి ఉంటుంది సగం కరిగి ఉంటుంది “. కొలను కూడా రెండు స్థితుల్లో ఉంటుంది హోల్డన్ ఎలాగైతే సగం ఇటు బాల్యానికి సగం అటు యవ్వనానికి మధ్య స్థితిలో వున్నాడో అలా .


జీవితం సర్దుబాటు అన్నట్లుగా ఎంత ఆ వ్యవస్థని వ్యతిరేకించినా, విమర్శించినా, పారిపోవడానికి ప్రయత్నించినా మనిషి కొన్నిటి నుండి తప్పించుకోలేడు.హోల్డన్ ఎంత తన స్కూలును, టీచర్లను, విద్యావ్యవస్థను, పెద్దలలోని ఫోనినెస్ ను విమర్శించినా చివరికి మళ్లీ స్కూలుకు వెళ్లినట్లు నవల ముగింపులో తానే చెప్పుకుంటాడు. మిస్టర్ ఆంటోలిని చెప్పే మాటల్ని ఇక్కడ మనం ఉదహరించవచ్చు .” నీకు మంచి అవగాహన ఉంటే స్కూల్లో నిన్ను నీవు అప్లయ్ చేసుకో. నువ్వు ఒక విద్యార్థివి… ఆ ఆలోచన నీకు ఆసక్తిగా అనిపించినా అనిపించకపోయినా నీవు విజ్ఞానం ప్రేమలో వున్నావ్. నీవు తెలుసుకుంటావని నేను అనుకుంటాను.. మానవుని ప్రవర్తనతో గందరగోళo పడి ,భయపడి ,ఆఖరికి విసిగిపోయిన వాళ్లలో నువ్వు మొదటి మనిషివి కాదని తెలుసుకుంటావు. ఈ విషయంలో నీవు ఏ మాత్రం ఒంటరి కాదు, అది తెలుసుకున్నందుకు ఎగ్జయిట్ అయి ఉత్తేజాన్ని పొందుతావు . చాలా మంది నైతికంగా ,ఆధ్యాత్మికంగా ఇబ్బంది పడుతున్నారు..ఇప్పుడు నీవు ఇబ్బంది పడుతున్నట్లు. వాళ్ళలో కొంతమంది వాళ్ళ ఇబ్బందులన్నిటిని సంతోషంగా దాటుకున్నారు . నువ్వు వాటినుంచి నేర్చుకుంటావు . ఒక వేళ నువ్వు అనుకుంటే . ఏదో ఒక రోజు,ఒక వేళ అందించడానికి నీ దగ్గర ఏదైనా ఉంటే ఎవరో ఒకరు నీ దగ్గర నుంచి దాన్ని అంది పుచ్చుకుంటారు. అది ఒక మంచి ఇచ్చి పుచ్చుకునే ధోరణి. ఆది కేవలం చదువు కాదు. అది ఒక చరిత్ర . అది ఒక కవిత్వం. చదువుకున్న మంచి విద్వత్తు వున్న మనుషులు, ఒకవేళ వాళ్ళు తెలివైన సృజనాత్మకత కలిగిన వాళ్ళయి ఉంటే - దురదృష్టవశాత్తు, అది చాలా అరుదైన విషయం. వాళ్ళు వాళ్ళ వెనకాల లెక్కలేనన్ని ఎక్కువ విలువైన సత్యాలను వదిలి వెళతారు.” వాటిని హోల్డన్ అంగీకరించినట్లేనా ?




ప్రచురణ విశాలాంధ్ర , డిశంబర్, 12,2016

యాభై ఏళ్ళ “వందేళ్ల ఏకాంతం”


“నేను ఏ దేశం లో వున్నా లాటిన్ అమెరికాకు చెందిన వాడిగానే అనుకుంటాను, అయితే నా మాతృభూమి అరకటక పై నాకున్న స్వదేశీ బ్రాంతిని త్యజించలేదు, ఎందుకంటే అక్కడే నేను ఒకరోజు వాస్తవానికి, బ్రాంతికి మధ్య గల తేడాను నా కథకు వస్తువుగా కనుగొన్నాను.” - గేబ్రియల్ గార్సియా మార్క్వెజ్

యాభై ఏళ్ల క్రిందట గేబ్రియల్ గార్సియా మార్క్వెజ్ తన నవల “సియన్ అన్యోస్ సోలేడెడ్” స్పానిష్ భాషలో రాశారు (దీన్ని ఇంగ్లిష్ లో “వన్ హండ్రెడ్ యియర్స్ ఆఫ్ సాలిట్యూడ్” గా అనువాదం చేశారు తెలుగులో మనం “వందేళ్ల ఏకాంతం“అనుకుందాం) ప్రపంచ సాహిత్యంలో ఒక ఉన్నతస్థానం అధిరోహించిన ఈ నవల అచ్చయి యాభై ఏళ్ళు అయినా తన ఆకర్షణను కోల్పోలేదు, ఇంకా ఎక్కువ ఆదరణకు నోచుకుంటోంది. ఇటీవలే ది హారి రాన్సం సెంటర్, టెక్సాస్ యూనివర్సిటీ $2.2 మిలియన్లు చెల్లించి అతని రచనల్ని సొంతo చేసుకున్నారు. అందులో స్పానిష్ లో టైప్ చేయబడిన మార్క్వెజ్ గొప్ప రచన “సియోన్ అనోస్ డే సొలిడెడ్” (వందేళ్ల ఏకాంతం) కూడా వుంది. ఈ గొప్ప నవలను రాయడానికి మార్క్వెజ్ ను ప్రేరేపించిన పరిస్థితులు ఏమిటో చూద్దాం.


ఉత్తర కొలంబియాలోని “అరకటక” అనే చిన్న పట్టణంలో మార్చ్ 6న 1928లో శాంటియాగో మార్క్వెజ్ , గేబ్రియల్ ఎలిగో మార్క్వెజ్ లకు గేబ్రియల్ గార్సియా మార్క్వెజ్ జన్మించారు. చాలా పేదరికంలో వున్న మార్క్వెజ్ తల్లిదండ్రులు మార్క్వెజ్ పెంపకాన్ని వాళ్ళ అమ్మమ్మ తాతయ్యలకు ఇచ్చారు. అదే సమయంలో బనానా బూమ్ స్ట్రైక్, దాన్ని అణచి వేయడానికి ప్రభుత్వo చేపట్టిన క్రూరమైన చర్యలు, వందలకొద్దీ సమ్మకారుల హత్యలు, వాళ్ళను ప్రభుత్వమే సామూహికoగా సమాధి చేయడం పట్టణాన్ని కుదిపివేశాయి. ఈ భయంకర నేపథ్యంలో మార్క్వెజ్ బాల్యం గడిచింది. ఇదే అతని “వందేళ్ల ఏకాంతం” లోను ఇంకా ఇతర రచనలలోనూ తరచు చర్చకు రావడం పాఠకులు గమనించవచ్చు.


మార్క్వెజ్ నిరాశలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు జర్నలిస్ట్ గా తన కుటుంబానికి కనీస అవసరాలు కూడా తీర్చలేక ఘర్షణపడుతున్నప్పుడు అతని తల్లి అతన్ని “అరకటక” ఆమె స్వగ్రామం, మార్క్వెజ్ చిన్నప్పుడు పెరిగిన వూరికి తీసికెళ్ళింది. అరకటక లోని ప్రజల దైన్యాన్ని, పేదరికాన్ని, నిస్సహాయతని చూసి చలించిపోయిన మార్క్వెజ్, “అరకటక” ఆత్మఘోషని తన ఆత్మతో విన్నాడు. అదే అతని నవల “వందేళ్ల ఏకాంతం”లో “మకాండో “ గ్రామంగా ఊపిరి పోసుకోవడానికి కారణం మయింది. ఆ గ్రామం జీవనాడిని పట్టుకున్న “వందేళ్ల ఏకాంతం “నవల లాటిన్ అమెరికన్ సాహిత్యంలో ఒక మైలు రాయిగా నిలిచిపోయింది. కొలంబియా లోని “అరకటక ” “మకాండో” అనే వూహ గ్రామంగా ఎలా రూపు దిద్దుకుంది? దీనికి మనకు మార్క్వెజ్ కుటుంబచరిత్ర తో పాటు కొలంబియా చరిత్ర కూడా తెలియాలి. ఎందుకంటే ఇదే అతని “వందేళ్ల ఏకాంతం”నవలకు, ఇంకా అనేక కథలకు,నవలలకు నేపథ్యంగా ఉంటుంది కాబట్టి.


కొలంబియా చరిత్ర



కొలంబియా 1810లో స్పెయిన్ నుండి స్వాతంత్రం పొందిoది. కొలంబియా లాటిన్ అమెరికన్ దేశాల్లో మొట్టమొదటి ప్రజాస్వామ్య దేశం అయినప్పటికీ, స్వతంత్రం వచ్చి వందేళ్లు అయినా శాంతిభద్రతలు, న్యాయం, ధర్మం, చట్టం అక్కడ కొరవడ్డాయి. ఇంగ్లిష్, స్పానిష్ పాలకులు కొలంబియా భూమిని బంగారం కొరకు చిన్నాభిన్నం చేశారు. నెపోలియన్ స్పెయిన్ రాజును 1810లో కొలంబియా నుండి తరిమివేశాక కొద్దీ కాలం స్వేచ్ఛను అనుభవించిన కొలంబియా, మళ్ళీ 1815లో జనరల్ మురీల్లో దాడులతో అట్టుడికి పోయింది. 1820లో సైమన్ బోలివర్ దేశాన్ని దాస్యం నుండి విముక్తి కలిగించి మొట్టమొదటి ప్రెసిడెంట్ గా బాధ్యతను తీసుకున్నాడు. దేశం “లిబరల్స్”, “కన్జర్వేటివ్స్” అనే రెండు రాజకీయ పార్టీలు గా విడిపోయి తమ జగడాన్ని పునరావృతం చేశాయి. ఈ రెండు పార్టీల గురించి మనకు మార్క్వెజ్ రచనల్లో అవగతమవుతుంది. రెండు పార్టీలు ఏ రకమైన నైతిక విలువలకు కట్టుబడి వుండవు, రెండూ అవినీతిని, లంచగొండితనాన్ని ప్రోత్సహించాయి మరియు ఎపుడూ పరస్పరం నిందించుకునేవి కూడా. నిజానికి కొలంబియా విషాదచరిత్ర మొత్తంలో రెండు పార్టీలు ఎప్పుడూ ప్రత్యక్ష యుద్ధం చేస్తున్నట్లుగా అనిపించేది.


19వ శతాబ్దం మొత్తం తిరుగుబాటుదారులు, స్థానికంగాను, జాతీయ స్థాయిలోను అంతర్యుద్ధం చేస్తూనే వున్నారు. ఒక శతాబ్దపు రక్తపాతం “వెయ్యి రోజుల యుద్ధం“ తో 1902 లో లిబరల్స్ ల ఓటమితో అంతమైంది. 10లక్షల మంది ప్రాణాల్ని బలిగొన్న ఈ యుద్ధంలో ఎక్కువగా రైతులు, రైతుకూలీలు వాళ్ళ పిల్లలు బలయ్యారు. మార్క్వెజ్ తాతగారు ఈ యుద్ధంలో పాల్గొన్నారు, ఇంకా మార్క్వెజ్ బంధువులు అనేక పాత్రలరూపంలో ఈ యుద్ధంలో అమరులవడం మనం మార్క్వెజ్ రచనల్లో చూడగలం.


కొలంబియా చరిత్రలో మరొక విషాదకర ఘట్టం 1928 లో జరిగిన “బనానా సమ్మె - ఊచకోత”. దీని ప్రభావం మార్క్వెజ్ “వందేళ్ల ఏకాంతం” లోను, ఇంకా ఇతర రచనలలోనూ గమనించగలరు. అరటిపళ్ళు కొలంబియా ఆర్ధిక వ్యవస్థపై ఎంతో ప్రభావం చూపేవి.ఎందుకంటే కొలంబియా మొత్తం అరటిపళ్ళను పండించేవారు. వాటిని “యునైటెడ్ ఫ్రూట్ కంపెనీ” ఒక్కటే కొనుగోలు చేసి గుత్తాధిపత్యం చేయడమే కాకుండా తక్కువ ధర ఇచ్చి రైతులను దోపిడీ చేసేది. అరకటక ప్రాంతమంతా కూడా అరటి పండించేవారు. అక్టోబర్ 1928 లో “సియెనగా” అనే ప్రాంతంలో “అరకటక”కు 30 కిలోమీటర్లు దూరం లో 32000 మంది రైతులు కూలీలు సమ్మె ద్వారా తమ నిరసన వ్యక్తం చేయడానికి గుమిగూడారు. సమ్మెను అణచి వేయడానికి ప్రభుత్వం సైనికులను పంపింది. నిరాయుధులైన రైతులపై, కూలీలపై సైనికులు జరిపిన కాల్పుల్లో వందల కొద్దీ మరణించారు. తర్వాత కూడా కొన్ని నెలలపాటు ఎంతో మంది ప్రజలు అదృశ్యం అయ్యారు.వాళ్లకు సంబంధించిన వివరాలు ఎవరికీ తెలియలేదు, సీయోనగా ఉదంతం జరిగినట్లు అధికారులు అంగీకరించలేదు, దాని గురించి విచారణ జరగలేదు. అంతేకాదు ఆ ఉదంతం ఎక్కడా ప్రస్తావించడం జరగకపోగా చరిత్ర పుస్తకాల నుండి కూడా దాన్ని తొలగించారు. దీన్ని మార్క్వెజ్ పూస గుచ్చినట్లు తన “వందేళ్ల ఏకాంతం” నవలలో వివరంగా సజీవoగా చూసినట్లు రాశారు. ఒక నవల మరుగున పడ్డ చరిత్రను త్రవ్వి తీసి చరితార్థం చేయగలదు అనడానికి ”వందేళ్ల ఏకాంతం“ ఒక మంచి ఉదాహరణ. అంతేకాదు వాస్తవాన్ని గ్రంధస్తం చేయడం ద్వారా దానికి అమరత్వాన్ని కూడా రచయిత ఆపాదించగలడు.


“లా వయిలెన్స్” లేక “ది వయిలెన్స్” మార్క్వెజ్ నవలలో తరచుగా వినపడే పదాలు. దీనికి మూలాలు “బనానా ఊచకోత“ లో వున్నాయి. జోర్గ్ ఎలిసెర్ గైటాన్ అనే రైతు నాయకుడు పేదలపాలిట పెన్నిధిగా ఉంటూ పార్టీ నాయకుడుగా ఎదిగాక 1947లో ఎన్నికలప్పుడు హత్య చేయబడ్డాడు. పట్టణమంతా మూడురోజులపాటు అల్లర్లు, మారణకాండ చెలరేగాయి, 2500 మంది దాకా చనిపోయారు. రెండు పార్టీల వాళ్ళకు గెరిల్లా సైన్యం వుంది. గెరిల్లా సైన్యం చేసిన ఘాతుకాలు దేశాన్ని ఉడికించాయి. పల్లెలు, పట్టణాలు మంటలకు ఆహుతి అయ్యాయి, వేలకొద్దీ ప్రజలు ఆ మంటల్లో కాలిపోయారు. వారిలో స్త్రీలు, పిల్లలు వున్నారు. సైనికులు పంటలు పoడించకుండా పొలాల్ని జ్యప్తు చేశారు. లక్షల కొద్దీ రైతులు దేశాన్ని విడిచి పెట్టి పోయారు. 1949 లో కన్సర్వేటివ్ పార్టీ వాళ్ళు లిబరల్ పార్టీ నాయకుడ్ని కాంగ్రెస్ హాల్లోనే అతను ఉపన్యాసం ఇస్తుండగా చంపివేశారు. కాంగ్రెస్ ను రద్దు చేసి దేశాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నామని చాటి లిబర్లల్స్ ని వేటాడి వేటాడి చంపివేశారు. దేశాన్ని ఛిద్రం చేసిన “లా వయిలెన్స్” 150,000 కొలంబియన్స్ ని 1953 వరకు బలి తీసుకుంది. ఇదే నేపథ్యం “వందేళ్ల ఏకాంతం”లో మనకు కనపడుతుంది.


మార్క్వెజ్ కుటుంబం - పెంపకం ప్రభావం



మార్క్వెజ్ కుటుంబంలోని వ్యక్తులు, బంధువులు అతని పెంపకంపై ప్రభావం చూపినట్లు ఆయన తన రచనల్లో తరచు పేర్కొంటారు. అందరిలోకి మార్క్వెజ్ అమ్మమ్మ ట్రాంక్విలోనా ఇగురాన్ కోట్స్ , తాతయ్య కల్నల్ నికోలస్ రికార్డో మార్క్వెజ్ మెజా ప్రభావం ఎక్కువుంది.మార్క్వెజ్ తాతయ్య లిబరల్ పార్టీకి చెందిన ప్రముఖుడు. “వార్ అఫ్ థౌజండ్ డేస్” లో పాల్గొన్నాడు. “అరకటక” నిర్మాణానికి అతనే బాధ్యుడు, వూర్లో కూడా కథానాయకుడిగా, పెద్ద మనిషిగా గుర్తింపు వున్నవాడు. ఎందుకంటే బనానా ఊచకోత జరిగినప్పుడు అతను ఒక్కడే అధికారుల్ని నిలదీశాడు. 1929 కాంగ్రెస్ లో జరిగిన మారణహోమం గురించి తన గొంతెత్తి ప్రశ్నించినవాడు కల్నల్ నికొలస్. కల్నల్ నికొలస్ మంచి కథకుడు, అతనెన్నో రహస్యాల్ని తనలో దాచుకున్నాడు.అతను వయసులో ఉండగా ద్వందయుద్ధంలో ఒకతన్ని చంపాడు. ఆ హత్య అతని జీవితాంతం అపరాధభావం కలిగేట్లు చేసిందని మనుమడైన మార్క్వెజ్ తో చెప్పాడు. ఆ రోజుల్లో యుద్ధం చేయడం కుర్రాళ్ళకు తుపాకులతో చేసే ఒక ఆట లాగా అనిపించిందoటాడు.

మార్క్వెజ్ కు అతను చిన్నప్పుడు ఎన్నో కథలు చెప్పేవాడు, ప్రతి ఏడు సర్కస్ కు తీసికెళ్ళేవాడు అంతేకాదు ఐస్ ను మొట్ట మొదటిసారిగా మార్క్వెజ్ కు అతనే పరిచయం చేశాడు. ఈ విషయాలన్నీ మార్క్వెజ్ తన రచనల్లోని పాత్రలతో చెప్పిస్తాడు. మార్క్వెజ్ అమ్మమ్మ ట్రాంక్విలోనా ఇగురాన్ కోట్స్ కూడా అతని పై చాలా ప్రభావం చూపింది. ఆమె చాలా మూఢనమ్మకాలు కలిగివుండేది. జానపదుల కుండే విశ్వాసాలు, దెయ్యాలు, భూతాలు, శకునాలను నమ్మేది. కథల్లో ఈ నమ్మకాల్ని కలిపి మార్క్వెజ్ కు కథలు చెప్పేది. అయితే మార్క్వెజ్ తాతయ్య కు ఇవేవీ నమ్మకం ఉండేదికాదు, పైగా వీటిని నమ్మొద్దని మార్క్వెజ్ ను హెచ్చరించేవాడు. అయితే మార్క్వెజ్ వాటిని నమ్మేవాడు. ఆమె కథ చెప్పే విధం ప్రత్యేకంగా ఉండేది, అతనికి తెగ నచ్చేది. అవి ఎంత ఊహాజనకంగా వున్నా, ఎంత నమ్మశక్యం కాకున్నా మార్క్వెజ్ కు ఆమె కథలను నమ్మే విధంగా చెప్పేది అవి నిజంగా జరిగినట్లుగా అతనికి అనిపించేవి. ఇదే పద్దతిని కథ చెప్పడానికి ముప్పై ఏళ్ల తర్వాత మార్క్వెజ్ అవలంభించి ప్రపంచ పాఠకుల్ని మెప్పించాడు. మార్క్వెజ్ తన రచనల్లో ఉపయోగించే మౌఖిక కథనం అతను బాల్యంలో అతని అమ్మమ్మ దగ్గర విని నేర్చుకున్నదే అయితే దాన్ని ప్రకటించిన విధానం అతని రచనలకు చాలా బాగా సరిపోయింది. అంతేకాదు నిజ జీవితంలో వున్న వాటికంటే ఎక్కువ వివరణ ఇవ్వడానికి మౌఖిక కథనంతో పాటు మాజిక్ రియలిజం అనే సాహితీ ప్రక్రియ అతనికి ఎక్కువ ఉపయోగపడింది.


ఏకాంతంలో ఉద్భవించిన వందేళ్ల ఏకాంతం

తన తల్లితో కలిసి “అరకటక” లోని మరమ్మత్తు చేయడానికి వీలుకాని తన తాతగారి ఇల్లు అమ్మడానికి వెళ్ళినప్పుడు మార్క్వెజ్ తన చిన్ననాటి జ్ఞాపకాల సుడిగుండాల్లో చిక్కుకుపోయారు. ఆ పట్టణమంతా స్తంభించిన కాలం చిక్కుకుపోయిందనిపించింది. అప్పటికే అరకటకలోని ఆ ఇంటిలో తన జ్ఞాపకాల నేపథ్యంతో “లా కస“ అనే నవల రాయాలని అనుకున్నాడు. “అరకటక” వచ్చివెళ్లిన అనుభవాల్ని నేపథ్యంగా అతని మొదటి చిన్న నవల “లీఫ్ స్టార్మ్ “ రాశాడు. అది ఒక రకమైన శక్తివంతమైన ప్రేరణతో నడిచింది. నిజానికి దానికి “ మకాండో ” అని పేరు పెట్టాడు. “మకాండో” అంటే బంటు భాషలో “అరటి” అని అర్థం. అయితే దాన్ని 1952 లో పబ్లిషర్లు తిరస్కరించారు. మార్క్వెజ్ దాన్ని టేబిల్ డ్రాయర్లో గిరాటేశాడు. తిరస్కారం, పేదరికంలో వున్నా, వేశ్య లుండే ఒక అపార్ట్మెంట్ లోనే ఒక గదిలో ఎంతో మంది స్నేహబృందం చుట్టూ ఉండగా మార్క్వెజ్ ఎంతో సంతోషంగా ఉండేవాడు. “ఎల్ హెరాల్డో “ అనే పత్రికకు “కాలమ్” రచయితగా పనిచేసేవాడు. సాయంత్రాలు కాఫీలు, సిగరెట్లు, స్నేహితుల మధ్య రచనలు చేసేవాడు.


1953 లో అతనిలో అకస్మాత్తుగా ఒకరకమైన అలజడి మొదలైంది. కొంతకాలం గమ్యం లేకుండా ప్రయాణం చేశాడు. కొన్ని కథలకు కావాల్సిన ముడి సరుకు కోసం ఆలోచనలు చేస్తుండేవాడు. కమ్యూనిస్ట్ పార్టీ లో కొంతకాలం సభ్యత్వం తీసుకున్నాడు, చిన్నప్పుడు తాతగారు తీవ్రవాద లిబరల్ నాయకుడిగా మార్క్వెజ్ పై ఎంతో ప్రభావం వుంది. మార్క్సిస్టు భావాల్ని ప్రేమించడం అతనికి స్కూల్ టీచర్లు నూరి పోశారు. అయితే మార్క్వెజ్ కమ్యూనిస్టులతో వుండే దురభిమానంను వ్యతిరేకించాడు. కానీ వామపక్షాల విషయాల పట్ల మార్క్వెజ్ సుముఖంగా ఉండేవాడు భావిలో సోషలిజమే ప్రపంచాన్ని నిర్దేశిస్తుందని నమ్మేవాడు.


“లా వయిలెన్సియా“ కాలంలో రచయితగా జర్నలిస్ట్ గా తన ధర్మం చేస్తున్నా అప్పటి నియంత రోజర్స్ పినిల్లా కంటపడకుండా ఉండడం అప్పుడు తప్పని సరిగా ఉండేది. 1955 లో “ఎల్ ఎస్పెక్టేటర్“ లో అదృశ్య రచయితగా పనిచేశాడు. పినిల్లా గవర్నమెంట్ “ఎల్ ఎస్పెక్టేటర్” మూయించడంతో మార్క్వెజ్ వుద్యోగం పోయింది. అప్పుడే హేమిoగ్వే రచనలు అతన్ని విపరీతంగా ఆకర్షించాయి.”ఇన్ ది ఈవిల్ అవర్ “ అనే నవల రాశారు. కానీ అతని మెదడులో తుఫాన్ రేపుతున్న “మకాండో “అతన్ని వదిలి పెట్టడం లేదు . అయితే “మకాండో “ కథను కాగితంపై పెట్టడానికి అతనికి సరైన ప్రేరణ లభించలేదు.


కమ్యూనిజం కూడా “లా వయిలెన్సియా“తో లాగే హింసాత్మకంగా మారడంతో మార్క్వెజ్ నిర్వేదానికి, నిరాశకు లోనయ్యాడు. కొలంబియా అధ్యక్షుడు మెమెంటోస్ అమెరికన్ సామ్రాజ్యవాదానికి, నిక్సన్ కు లొంగిపోవడంతో మార్క్వెజ్ దంపతులు మెమొంటోస్ ప్రభుత్వం నుండి దూరం వెళ్లిపోయారు. తర్వాత మార్క్వెజ్ కాస్ట్రో ఉద్యమానికి ఆకర్షితులు కావడం ఆ తర్వాత కాస్ట్రో వార్త ఏజెన్సీ” ప్రేన్సా లాటినా“ లో పని చేయడంతో పాటు కాస్ట్రో కు మంచి స్నేహితుడయ్యాడు. కొన్ని సినిమాలకు సబ్ టైటిల్స్ రాయడం తో పాటు కొన్ని కాల్పనిక నవలలు రాశాడు. “నో వన్ రైట్స్ టు ది కల్నల్ “ 61లో “బిగ్ మమాస్ ఫ్యునెరల్” 62 లో ప్రచురితం అయ్యాయి. అతని ఏ నవల కూడా 700 కాపీల కంటే ఎక్కువ అమ్ముడు పోకపోగా, నవలలపై ఏ రాయల్టీ రాకపోయినా మార్క్వెజ్ మనసులో “మకాండో” మీద నవల రాయడం మీద మనసు తగ్గలేదు.


జనవరి 1965లో కుటుంబంతో సెలవులో గడపడానికి వెళుతుండగా మార్క్వెజ్ కు అకస్మాత్తుగా మెరుపులా మకాండో వాణి వినిపించింది.మార్క్వెజ్ కు ఆ వాణి “వందేళ్ల ఏకాంతం” నవల ఎలా రాయాలో స్పష్టంగా తెలిపినట్లైంది. ఎంత స్పష్టంగా అంటే అప్పటికప్పుడు ఆయన టైపిస్ట్ కు మొదటి చాప్టర్ లోని పదం, పదం డిక్టేట్ చేయగలిగేంత స్పష్టంగా. మార్క్వెజ్ తన భార్య మెర్సిడెస్ కు కుటుంబ బాధ్యత అప్పహించి తాను 18 నెలల వరకు తన గదిలో తనని తానే బందీని చేసుకున్నాడు. ఇల్లు జరగడానికి కారు అమ్మేశారు,ఇంట్లో వస్తువులన్నీ కుదవకు వెళ్లిపోయాయి. స్నేహితుల సహాయంతో పాటు అప్పులవాళ్ళు కూడా ఉదారంగా అప్పులిచ్చారు ఎందుకో అందరికి ఒక గొప్ప రచన వెలువడుతోందని అనిపించింది.


మెక్సికో సిటీలో ప్రశాంత వాతావరణం వున్న ఒక ఇంటిలో రాతబల్ల (స్టడీ టేబిల్) దగ్గర అంతకు ముందెప్పుడూ అనుభవంలోకి రాని తర్వాత కూడా అలాంటి అనుభవం తెలియని స్థితిలో రోజుకు 60 సిగరెట్లు కాలుస్తూ మార్క్వెజ్ తన ఏకాంతాన్ని కనుగొన్నాడు. రికార్డు ప్లేయర్ నడుస్తుండేది. కరీబియన్ పట్టణం “మకాండో” యొక్క చరిత్ర, బుయండియాస్ వంశవృక్షాన్ని తెలిపే పటాలున్న గోడపై మార్క్వెజ్ చూపులు నిలిచిపోయేవి. మార్క్వెజ్ భౌతికంగా వున్నది 1960లలో మెక్సికోలో, అతని అంతరంగం మాత్రం 1920లో కొలంబియాలో ఉండేది. మార్క్వెజ్ టైప్ రైటర్ ముందు కూర్చుంటే కొలంబియా గత చరిత్రలోని పాత్రలు ఆవహించేవి. అతనా సమయంలో మకాండో ప్రజలు నిద్రలేమి అనే వ్యాధితో ఎలా బాధపడేవారో చూడగలిగేవాడు, సాహసికులైన యువకులు కొలంబియా అంతర్యుద్ధంలో ఎలా పాల్గొన్నారో అతని కళ్ళకు కట్టినట్లుండేది, బనానా ఊచకోతకు గురైన అమాయకుల శవాలు రాత్రికి రాత్రి ఎలా రైళ్లలో రవాణా అయ్యాయో మార్క్వెజ్ కు తెలుస్తుండేది. తప్పిపోవడం అంటే ఇంకెప్పుడూ కనపడకుండా పోవడం అనే సత్యాన్ని జీర్ణించుకోవడాన్ని ఆపై ఎప్పుడూ పోలీసుల్ని తప్పి పోయిన వాళ్ళ గురించి విచారించమని అడగరాదనే జ్ఞానాన్ని కుటుంబ సభ్యుల కలిగివుండడం చూసి విస్మయం చెందేవాడు. “కలల్లో నేను సాహిత్యాన్ని కనుగొన్నాను “ అన్నాడు మార్క్వెజ్. బయటి ప్రపంచం ఏమిటో తెలియకుండా గదిలో తనని తాను బంధించుకున్న మార్క్వెజ్ గది తలుపులు భోజనం వేళకు, సిగరెట్ల కోసం మాత్రమే తెరుచుకునేవి.


రోజులు గడుస్తున్నకొద్దీ టైప్ చేయబడిన గొప్ప నవల పేజీలు పెరుగుతున్నకొద్దీ అతనింట్లో అన్ని వస్తువులు తాకట్టు కు వెళ్లిపోయాయి.1966 సంవత్సరం ఆఖరుకు నవల పూర్తయింది. తర్వాత ప్రెస్ నుండి మే 30, 1967లో బయటికి వచ్చిన ఈ నవల స్పానిష్ పాఠకలోకాన్ని బీటిల్స్ కంటే ఎక్కువ ఉర్రూతలూగించింది. “వందేళ్ల ఏకాంతం” వెలువడ్డాక వారం లోపల 8000 కాపీలు అమ్ముడుపోయాయి, మూడేళ్ళలో 5లక్షల కాపీలు అమ్ముడయ్యాయి. మార్క్వెజ్ కు అప్పటికి 39ఏళ్ల వయసు. అభిమానుల అభినందనలు,ఇంటర్వూలు, అవార్డులు ఎంతో కీర్తి ఆ వయసుకు అది గొప్ప ఘనకార్యమే .


మాజిక రియలిజం అనే లాటిన్ అమెరికన్ సాహితీ ప్రక్రియను మార్క్వెజ్ తాను తీసుకున్న లాటిన్ అమెరికన్ చరిత్ర చెప్పడానికి ఎంతో నేర్పరితనంతో వాడాడు. ఒక కొత్త ఒరవడిని సృష్టించిన ఈ నవల మరియు నవలాకారుడు మార్క్వెజ్ ఒక అద్భుతంగా చూడబడ్డారు. 1970 లో దీన్ని గ్రెగొరీ రాబసా ( Gregory Rabassa ) ఇంగ్లిష్ లోకి అనువాదం చేశాక 1970లో పేపర్ బ్యాక్ ఎడిషన్ మండే సూర్యుడి చిత్రం తో వచ్చిన “వందేళ్ల ఏకాంతం“ నవల ఆ దశాబ్దం సాహిత్యంలో విజయ చిహ్నాంగా ఉండిపోయింది. 1982 లో మార్క్వెజ్ కు నోబెల్ ప్రయిజ్ వచ్చాక ప్రపంచపు నలుమూలలకు “ఏకాంతం” వెళ్లగలిగింది. “డాన్ కిక్సాస్” (Don Quixote ) నవల తర్వాత స్పానిష్ సాహిత్యంలో అంతగా ప్రభావం చూపిన నవలగా“ వందేళ్ల ఏకాంతం“ పేరొందింది.


మార్క్వెజ్ “వందేళ్ల ఏకాంతం” గురించి మాట్లాడుతూ ఇలా అన్నారు“ నేను నా నవల రాసేప్పుడు మా అమ్మమ్మ కథ చెప్పే పద్ధతినే పాటించాను ఎందుకంటే ఆమె కథలో అతీంద్రియ శక్తుల గురించి గానీ, అద్భుతాల గురించి చెప్పేటప్పుడు ఎంతో సహజంగా ఉండేది ఆమె ముఖకవళికల్లో ఏ రకమైన మార్పు ఉండేది కాదు. నేను ముందు రాసిన పుస్తకాల్లో కథ చెప్పేప్పుడు అమ్మమ్మ చెప్పినవి పాటించలేదు . ఇప్పుడు నాకు తెలిసింది ఆ అద్భుతాల్ని నమ్మిన తర్వాతనే అలా భావరహితమైన వదనంతో అమ్మమ్మలా కథ చెప్పగలనని.”


“వందేళ్ల ఏకాంతం “ నవల మార్క్వెజ్ సమకాలికులైన రచయితల మనోభావాల్ని కూడా వ్యక్తం చేసింది . తాము చెప్పలేని భావాల్ని మార్క్వెజ్ తన నవలలో చెప్పారని రచయితలు భావించారు . “ఏకాంతం “ ఒక సంపూర్ణమైన నవల, అది లాటిన్ అమెరికాను సామాజిక, ఆర్ధిక, సాంసృతిక, రాజకీయ, చారిత్రక, పౌరాణిక, ఇతిహాసిక కోణంలో కలవరపరిచే విధంగా అతి సహజంగా ఆవిష్కరించింది. “ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం? నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం, నరజాతి చరిత్ర సమస్తం, దరిద్రులను కాల్చుకుతినడం, బలవంతులు దుర్బలజాతిని, బానిసలను కావించారు..నరహంతకులు ధరాధిపతులై చరిత్రమున ప్రసిద్ధి కెక్కిరి,రణరంగం కానిచోటు భూస్థలమంతా వెదకిన దొరకదు..గతమంతా తడిసె రక్తమున, కాకుంటే కన్నీళులతో ” శ్రీ శ్రీ చెప్పిన ఈ మాటల్లో లాటిన్ అమెరికా దేశమే ఏమీటి, భారత దేశమే ఏమిటి ? సమస్త భూప్రపంచము యొక్క చరిత్ర ఉందని అనిపిస్తుంది.


మార్క్వెజ్ పై ప్రభావాలు తన అమ్మమ్మే కాకుండా కాఫ్కా ప్రభావo కూడా తన రచనలపై ఉందని మార్క్వెజ్ చెప్పాడు. ఫాక్నర్ పౌరాణిక పట్టణం యోక్నాపఠాఫా (Yoknapatawpha) నుండి మకాండో ఉద్భవించిందని, మార్క్వెజ్ ”ఏకాంతం” నవలకు ముందు రాసిన రచనల్లో ఏదో కొరవడిందని అవి మరీ సంక్షిప్తంగా ఉన్నాయనిపిస్తోందని, అవి కేవలం మేధస్సు మధనంతో రాసినవి తప్ప, హృదయ స్పందనతో రాసినవి కాదని, వాటిలో జీవం నింపడానికి ఫాక్నర్ లాంటి వాళ్ళ రచనలు దోహదం చేశాయని, రచయిత తనకు చేరువగా వున్న వాటిని పరిశీలించి రాయాలన్న విషయాన్ని తాను గ్రహించాకే తనకు తృప్తి కలిగించే రచనలు చేశానని చెప్పుకున్నారు.

సోఫుకల్స్ “ ఎడిపస్ రెక్స్”, “ అంటిగొనే ” నుండి కూడా సంఘం, అధికారం, దాని దుర్వినియోగం లాంటి విషయాలు” ఏకాంతం” నవలకు తీసుకున్నానని, మొట్టమొదటి సారిగా మాజిక్ రియలిజాన్ని తన నవలలో వాడిన అలీజో కార్పెంటర్ ప్రభావం కూడా ఉందని చెప్పుకున్నారు.


ఏకాంతం నవలలో ఏముంది ?
మొదటి సారి “వందేళ్ల ఏకాంతం “చదివినప్పుడు నవల ఒక ప్రాంతం యొక్క చరిత్రగా మకాండో అనే పట్టణo గురించి, బుయాండియో కుటుంబలోని ఏడు తరాల చరిత్ర చదువుతున్నట్లుగా అనిపిస్తుంది. ఈ స్థానిక చరిత్ర నిజానికి ప్రత్యేకించి కొలంబియాను మరియు లాటిన్ అమెరికన్ దేశాల స్థితిగతుల్ని, విధివిధానాల్ని తెలియజేస్తుంది. అస్పష్టమైన ఇతిహాసకాలం నుండి జరుగుతున్న చరిత్ర, ఈనాటికీ జరుగుతూ వున్న అంతంలేని అంతర్యుద్ధాలు, వాటికి కారకులైన నియంతలు, సైనిక తిరుగుబాట్లు, కొద్ది కాలమే నిలిచిన ప్రజాస్వామ్యాలు, ప్రజల అగచాట్లు, తిరుగుబాట్లు, సమ్మెలు, అణచివేతలు, విప్లవాలు , విప్లవనాయకుల వెన్నుపోటు రాజకీయాలు, మరియు అమెరికా నావికాదళం చొరబాటు, విప్లవాన్ని అణచడానికి CIA విరాళాలు ఎక్కువ రావడం, ఇవన్నీ ఒక దేశాన్ని ఎంతగా నాశనం చేయొచ్చో అంత చేశాయి.


నవలలో 15 వ శతాబ్దంలో కొలంబియా పై స్పానిష్ విజయానికి చిహ్నంగా స్పానిష్ “రాగి పథకం ” మునిగి పోయిన అతి పెద్ద వ్యాపార ఓడ సూచిస్తాయి. తర్వాత వరుసగా స్థానిక ఇండియన్స్ తో నీగ్రో బానిసలతో మంతనాలు ఆ తర్వాత వరుసగా అంతర్యుద్ధాలు, అమెరికన్స్ రావడం తోటి ఆధునిక 20 శతాబ్ద సామ్రాజ్యవాదం, ఇంకా మరికొన్ని సంఘటనలు నిజంగా జరిగినవి. ఇవన్ని నవలలో లాటిన్ అమెరికా దేశ లక్షణాలుగా మనం గమనించవచ్చు.

మార్క్వెజ్ ప్రస్తుతాన్ని గతంగా మార్చి మకాండో లోని జీవన పరిస్థితి తెలుపుతాడు. అందులో పేదరికం ,అన్యాయం ఉంటాయి. ఏడు తరాలలో జొస్ ఆర్కాడియో బుయాండియా, అతని వారసులు నిరంతరం ఒకరికొకరు కనిపిస్తూనే వుంటారు.వాళ్ళు వంశానికి వారసులే కాకుండా పేర్లకు కూడా వారసులు. వాళ్ళ కోపాలు, ద్వేషాలు, కొనసాగుతున్న వైరాలు, యుద్ధాలు, వాళ్ళ పీడకలలు, వావి వరుస లేని శృంగారకాంక్షలు, వావి వరుస తప్పినచో వాళ్లకు పంది తోక తో బిడ్డ పుట్టడంతో వంశనాశనం జరుగుతుందనే జోస్యం గురించిన భయం , అయినా కోర్కెలకు దాసోహమయి అదే జరగడం.మకాండో నాశనంతో నవల ముగుస్తుంది. లాటిన్ అమెరికా చరిత్ర నడుస్తుండగా మకాండోలో బుయాండియోల ఆవిర్భావాల నుండి వినాశనం వరకు జరుగుతున్న చరిత్ర నవల సారాశం.


ఏకాంతం తెచ్చిన ఖ్యాతి, ప్రఖాతి

“వందేళ్ల ఏకాంతం” ఒక్క సారిగా మార్క్వెజ్ ను ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వ్యక్తిగా చేసింది.1969 లో ఇటలీ దేశపు “చయించియానో “అవార్డుతో పాటు బుక్ అఫ్ ది ఇయర్ కూడా 1969లో గెలుచుకుంది. 1970 లో ఇంగ్లిష్ లో తర్వాత 37 భాషల్లోకి అనువదింపబడింది. 30 మిలియన్ల కాపీలు అమ్ముడు పోయి గొప్ప నవలగా పేరొందింది. రొములో గాల్లెగో ప్రయిజ్, నే వ్ స్టెడ్ట్ ప్రయిజ్ కూడా వరించాయి. అంతేకాకుండా ఈ నవల అతన్ని ఆర్థికంగా కూడా ఎంతో ఎత్తుకు తీసికెళ్ళింది. రాజకీయంగా కూడా అతనికో ప్రత్యేకతను తెచ్చి పెట్టింది. పెద్ద ఇల్లు కట్టుకోవడానికి ఇంకా తన సొంత ఖర్చుతో ప్రచారానికి దిగి రాజకీయ, సామాజిక చైతన్యం కోసం ప్రయత్నించాడు. అతని రచనల ద్వారా వచ్చిన డబ్బును, విరాళాలను కమ్యూనిస్ట్ వ్యవస్థను బలపర్చడానికి ఖర్చు చేశాడు. మార్క్వెజ్ 1981లో ఫ్రెంచ్ లెజియన్ గౌరవ మెడల్ను, 1982 లో నోబెల్ బహుమతిని అందుకున్నారు. “వందేళ్ల ఏకాంతం“ నవలను ఒక్క అర్జెంటీనా లోనే ఒక వారంలోనే 8 వేల కాపీలు అమ్ముడు పోయింది అంతకుముందెప్పుడు దక్షిణ అమెరికా నవలకు ఇక్కడ ఇంత ఆదరణ లభించలేదు. కూలివాళ్ళు, గృహిణులు, ప్రొఫెసర్లు, వేశ్యలు కూడా చదివారు. “ ఏకాంతం” నవల ఎప్పుడో విడిపోయిన స్పానిష్ భాష మాట్లాడే సాహితీ ప్రియులందరిని ఏకం చేసింది. స్పెయిన్, లాటిన్ అమెరికా, పల్లె, పట్టణం, పరాయిదేశ (స్పెయిన్) పాలకులకు, పాలింపబడిన లాటిన్ అమెరికా దేశస్థులకు కూడా ప్రియమైన పుస్తకమయింది.


“వందేళ్ల ఏకాంతం”పై సమకాలీన రచయితల అభిప్రాయాలు ఏకాంతం నవలను గ్రెగరీ రబాసా చేసిన ఇంగ్లిష్ అనువాదం” వన్ హండ్రెడ్ యియర్స్ అఫ్ సాలిట్యూడ్” కూడా చాలా ప్రఖ్యాతి చెందింది. మార్క్వెజ్ గార్సియా తన స్పానిష్ నవల కంటే రాబాసా ఇంగ్లిష్ అనువాదమే బావుందని అనడంతో పాటు ,ఇంగ్లిష్ లో రాసిన లాటిన్ అమెరికన్ రచయితలలో రబాసా ప్రముఖుడని మెచ్చుకున్నాడు.


విలియం ఫాక్నర్ నవల గురించి ఇలా అంటారు “ గతం ఇక్కడ మరణించదు… నిజానికి ఇది గతం కాదు “


జాన్ లియొనార్డ్ “టైమ్స్“ అనే దినపత్రికలో “ఒక్క ఏకాంతం నవలతో ఒక్కసారిగా మార్క్వెజ్ గంటర్ గ్రాస్, నాబోకావ్ ల చెంతకి చేరుకున్నారు, అతని ఆకలి అతని వూహ కంటే విశాలమైనది, అతని విధినియక్తం ఈ రెండింటికంటే అద్భుతమైంది.”అన్నారు

విలియం కెన్నెడీ , న్యూయార్క్ టైమ్స్ బుక్ రివ్యూ లో ఇలా అన్నారు "బైబిల్ తర్వాత మానవాళి అంతా చదవతగ్గ ఒకే ఒక సాహిత్యం "వందేళ్ల ఏకాంతం" .ఈ నవల ద్వారా మార్క్వెజ్ పాఠకునిలో జీవితం పట్ల లోతైన భావనతో పాటు జీవితం పట్ల శూన్యతని కూడా పెంపొందిస్తాడు"



మాజిక్ రియలిజం యొక్క మాజిక్

మాజిక్ రియలిజం నిజానికి ఆవిర్భవించింది లాటిన్ అమెరికా లోనే. ఆ సాహితీ ప్రక్రియ అక్కడి నుండి ప్రపంచమంతా ప్రయాణం చేసింది అయినా లాటిన్ అమెరికాను వీడలేదు. మొట్టమొదటి సారిగా సాహిత్యంలో మాజిక్ రియలిజంను ప్రయోగించింది అలిజో కార్పెంటర్ తన “ది కింగ్ డం అఫ్ దిస్ వల్డ్ ” నవలలో. మార్క్వెజ్ ”ఏకాంతం” నవల కంటే ముందు గుంటర్ గ్రాస్ తన “టిన్ డ్రమ్” నవల రాశారు. అందులో ప్రపంచయుద్ధంకు ముందు తర్వాత జర్మన్ చరిత్ర ను ఆయన ఎంతో హృద్యంగా రాశారు. గ్రాస్, మార్క్వెజ్ లు మాజిక్ రియలిజంను అంతర్జాతీయ స్థాయికి తీసికెళ్ళారు. అంతేకాదు సాల్మన్ రష్ది, టోనీమోరీసన్, ఇసబెల్ అలెండ్ లాంటి లబ్దప్రతిష్టులైన రచయితల్ని ప్రభావితం చేశారు.


మాజిక్ రియలిజంను నిజానికి మార్క్వెజ్ కళ ద్వారా ప్రకృతి నియమాల్ని ఉల్లంఘించటానికి వాడుకున్నాడు. అయితే అంతిమంగా నవల బలమంతా పాఠకునికి బుయండియాలను వాళ్ళ ఇరుగు పొరుగు వాళ్ళను సజీవంగా ముందు నిలబెడుతుంది.


మార్క్వెజ్ మాజిక్ రియలిజం లో రాసిన “ఏకాంతం “చదివాక ప్రభావితమైన రచయితలు చాలా మంది వున్నారు. విలియం కెన్నెడీ “ఇరన్ వీడ్”లో చనిపోయిన శిశువు సమాధి నుండి తన తండ్రితో మాట్లాడడం, ఆలిస్ వాకర్ తన “ది కలర్ పర్పుల్”లో ఇనుప చువ్వలు మెత్తబడడం గురించి రాయడం , దేవుడికి పంపిన ఉత్తరాలకు సమాధానం రావడం, ఇసబెల్ అలెండ్ నవల “ది హవుస్ అఫ్ స్పిరిట్స్ ”లో చనిపోయిన ఒక చిలి ప్రెసిడెంట్ బంధువు ఆధునిక చిలి కథను ఒక కుటుంబ గాథగా చెప్పడం కూడా మాజిక్ రియలిజం పద్దతిలోనే రాయబడ్డాయి.


మార్క్వెజ్ నవల గురించి మాట్లాడుతూ సాల్మన్ రష్ది ఇలా అంటారు " మార్క్వెజ్ “వందేళ్ల ఏకాంతం” రాసే నాటికి మతం,మూఢనమ్మకాలు ప్రజల జీవితాల్ని ఎంతో ప్రభావం చూపుతుండేవి. పరాయి దేశపాలనలో కొలంబియా మ్రగ్గుతున్న సమయంలో ధనికులకు పేదలకు మధ్య ఎంతో వత్యాసం ఉండేది, మధ్యతరగతి వాళ్ళు అతి తక్కువుండేవాళ్లు, నియంతల నిరంకుశపాలనతో పాటు పాలకుల లంచగొండితనం ఆందోళనకరంగా ఉండేది. ఇక్కడ ఏదైతే వింతగా కనిపిస్తున్నాయో అవి నాకు అతి సహజంగా అనిపిస్తున్నాయి. ఇది మార్క్వెజ్ యొక్క గొప్ప విజయం ఎలాగంటే ఏ కాలంలో అయినా సాహిత్యo ఏదీ గుర్తించాలో ఆయన తెలియ చేశారు. యదార్థం నిజానికి సహజంగా ఉండాల్సిన అవసరం లేదు. ఇది మనం గ్రహించి గుర్తించాల్సిన సమయం వచ్చింది.”


వార్గాస్ ల్లోసా నోబెల్ గ్రహీత “వందేళ్ల ఏకాంతం” లోని మాజిక్ రియలిజంగురించి మాట్లాడుతూ “మార్క్వెజ్ శైలిలోని స్పష్టత, పారదర్శకత వలన ఈ పుస్తకం స్పానిష్ భాష మాట్లాడే వాళ్లందరినీ ఏకం చేయగలిగింది.అంతేకాదు . అంతేకాదు ఇది లాటిన్ అమెరికాను ప్రాతినిధ్యం వహించింది.లాటిన్ అమెరికా అంతర్యుద్ధాల్ని, అసమానతలను, లాటిన్ అమెరికా ప్రజలకు సంగీతం పై గల మక్కువ, వాళ్ళ కల్పనలు , నవలలో యదార్థం మరియు అద్భుతాలు ప్రతిభావంతంగా కలగలిపి పొందుపరచబడ్డాయి”.


యాభై ఏళ్ళయినా గేబ్రియల్ గార్సియా మార్క్వెజ్ నవల తన అస్థిత్వాన్ని కోల్పోలేదు, ఇంకా ఎక్కువ ఆదరణకు నోచుకుంటోంది. ప్రపంచ సాహిత్యం లో రెండవ ప్రపంచయుద్ధం తర్వాత “ఏకాంతం “ నవల చాలా మంది పాఠకుల్ని అలరించింది. అది ఎంతోమంది రచయితల కు స్ఫూర్తినిచ్చింది. టోనీ మోరీసన్ నుండి సాల్మన్ రష్ది వరకు “ఏకాంతం “ నవల చూపిన ప్రభావం గొప్పది. ఈ నవల శృంగారం, వినోదం , రాజకీయం, విప్లవ ధోరణి నింపి ఎలా విజయాన్ని సాధించింది అన్నది సాహిత్య చరిత్రలో ఈ అర్థ శతాబ్దం లో చాలా మందికి తెలియదు.


ఇప్పుడు వందేళ్ల ఏకాంతాన్ని ఎవరు ప్రాతినిధ్యం వహిస్తారు? ఇప్పుడు ఇది ఎవరికీ తెలియదు. కానీ బుయండియోలు మరియు వాళ్ళ గ్రామం మకాండో ఇప్పటికి వుంది. దానికి జాతి, మత, ప్రాంత, బేధం లేదు. మార్క్వెజ్ నవలలో గుంపులు గుంపులుగా ఎగిరే పసుపు పచ్చని సీతాకోక చిలుకలు ఎగరడం ఎంత సహజంగా వర్ణించారో అంత సహజంగా ఈ కాలంలో కూడా బుయాండియోలు వున్నారు మరి. ఏడు తరాలు వాళ్లయితే మనం ఎనిమిదో తరం.



ప్రచురణ ఆంధ్రజ్యోతి అక్టోబర్ 12,2016

Friday 10 June 2016

నల్లపూసల దండ


ఇవాలకూడా రాజుకు రమణికి గొడవైంది వందోసారి. గొడవకి కారణం నల్లపూసల దండే. రమణిని పెళ్లి చేసుకున్నాక పల్లెలో ఉండలేక, సమిష్టి కుటుంబoలో ఇమడలేని భార్యను సముదాయించలేక, పెళ్ళైన కొత్తలో ముద్దుల భార్య ను వదలివుండలేక, ఆమెను చీటికి మాటికి పుట్టింటికి పంపలేక, పంపినా మళ్లీ పిలుచుకుని రాలేక, పెళ్ళాం చాటు మొగుడనే నిందను భరించలేక, అప్పటికే నేర్చుకున్న డ్రైవింగ్ మీద కొండంత ఆశ చేత, ఊర్లోనే వున్న ప్రెసిడెంటుగారి కొడుకులు దగ్గరలోనే వున్న బస్తీలో వుండటం చేత, వాళ్ళతో వున్న సాన్నిహిత్యంతో అక్కడ బ్రతికేయచ్చుననే నమ్మకం చేత, బస్తిలోకి వచ్చి పడ్డాడు రాజు, రమణి ముద్దులగుమ్మతో.

ప్రెసిడెంటు గారి కొడుకు తన స్నేహితుని దగ్గర రాజును డ్రైవర్ గా పెట్టాడు. రమణి కూడా వాళ్ళింట్లోనే వుండి, వాళ్ళ పాపని చూసుకుంటే ఇంకొంచం ఆదాయం, మరి ఇల్లు సదుపాయం కూడా ఉంటుందని చెప్పినపుడు రాజుకు భయం వేసింది. తనని పనిమనిషిగా పెట్టే దానికా బస్తికి తీసుకొచ్చింది అని గొడవ పెడుతుందేమోనని. అందుకే ఆ విషయం ఏమీ చెప్పకుండా వాళ్ళింటికి తీసుకెళ్ళాడు. రాజు యజమాని అనిల్, అతని భార్య నేహ. ఇద్దరూ కాలేజిలో లెక్చరర్లుగా పనిచేస్తారు వాళ్లకి ముద్దులొలికే ఆరునెలల పాప, నేహ అమ్మమ్మగారు కూడా వాళ్ళతో వుంటారు. మొత్తానికి రమణికి బస్తితో పాటు, రాజు వుద్యోగం చేసే యజమాని, అనిల్, నేహ, వాళ్ళ పాప ఊహ కూడా తెగ నచ్చేసారు. అప్పుడే రమణి కూడా పనిచేస్తే వచ్చేలాభం గురించి రాజు చూచాయగా తెలిపాడు భయపడుతూనే. కానీ రమణికి ఆ ఇల్లు, తోటలోని అవుట్ హవుసు, ముద్దుగా వున్న ఊహాతో గడపడం, నేహమేడం స్నేహంగా ఉండండం నచ్చాక, ఎక్కడో ఊరిబయట వున్న వాళ్ళ చిన్నాన్నఇంటిలో ఓ నెల వుందామనుకున్ననిర్ణయాన్నిరద్దు చేసి అవుట్ హవుసు లోకి వెంటనే చేరేద్దాం అనేసింది.

రమణికి అక్కడ ఆన్ని బాగున్నాయి. తమ మధ్య ఎవరూ లేరు, ఉదయాన్నేలేచి పనికి పరుగు తీయక్కర లేదు. నేహమేడం,అనిల్ సారు లేచేప్పటికి ఏడవుతుంది, పాపని చూసుకుని, వంటమనిషికి సాయం చెయ్యడమే కాబట్టి, పని ఒత్తిడిలేదు. రాజు పని నేహ మేడంను కాలేజిలో వదిలి వచ్చేస్తే, మల్లి సాయంత్రం వెళ్లి తీసుకురావడం, బజార్లో పని వుంటే చూసుకోవడం, అంతే. రాజు రమణి సంతోషంగా వున్నారు. నేహ అనిల్ సార్ల దాంపత్యం చూసి రమణి కూడా కొంచం సాత్వికత నేర్చుకుంది.

నేహ మేడం సౌందర్యం ఓ పెద్ద ఆకర్షణగా వుండేది రాజుకు రమణికి. రాజుకు ఆమెను చూస్తే అమితమైన ఆనందం కలిగేది, నేహమేడం పిలిచి పని చెబితే చాలనుకునేవాడు, ఆమెను చూస్తూ వుండిపోవాలనిపించేది, రాములవారి గుళ్ళో సీతమ్మ వారి విగ్రహాన్ని చూసినప్పుడు లాగా. అందంతో పాటు వుండే ఆమె సంస్కారం, పనివాళ్ళను సైతం ఎంతో గౌరవంగా చూడడం, పలకరించడం, ఇంటి వాళ్ళలాగానే మంచి చెడ్డ విచారించడం లాంటి గుణాలు, ఆమె సౌందర్యానికి చందనపు పరిమళం అద్ది నట్ట్లుండేది.

మొదట్లో రాజుకు భార్య కోసం ఊరువిడిచి వచ్చినందుకు కొంచం అపరాధ భావన కలుగుతుండేది, అందువలన తన జీతంలో కొంత వూరికి పంపాలనుకున్నాడు. కొత్తలో పల్లె నుండి బయట పడడానికి రాజు వుద్యోగం చేస్తే వచ్చే జీతంలో సగం అమ్మా నాన్నకు పంపడానికి రమణి ఒప్పుకుంది కాబట్టి,అనిల్ వాళ్ళ జీతంలో సగం నేరుగా వాళ్ళ అమ్మానాన్నకు పంపే ఏర్పాటు చేసాడు. కాలం చాలా హాయిగా చీకు చింత లేకుండా గడిచిపోతూ ఉంది.

మానవ జీవితం ఆనందమయం చేసుకోవడం ఎంత కష్టంమో, దాంట్లోకి దుoఖం రాకుండా చూసుకోవడం అంతకంటే కష్టం. పూలనావలా సాగుతున్న రాజు,రమణిల కాపురంలో నల్లపూసలదండ అశాంతి గింజ నాటింది. అది మొలకెత్తి మొక్కై, మానై, వటవృక్షమై వూడలు జారాయి. నేహను చూసిన మరు నిముషంలోనే రమణి చూపులు ఆమె అందమైన ముఖం పై నుండి ఆమె గుండెలపై వుండే నల్లపూసలదండ పై పడ్డాయి .

"ఏంటో మేడం ఇంకేమి లేనట్లు ఎప్పుడూ ఆ ఒక్క నల్లపూసలదండే వేసుకుంటుంది " అనేది రాజుతో చాలా సార్లు.

రాజు నవ్వి "మేడంకు నగ లెందుకు? ఆమే బంగారంలా వుంటుంది" అని నాలుక కర్చుకున్నాడు.

కానీ రమణి అది పట్టించుకోలా, పైగా "ఎంత అందంగా వుంటుంది కదా మేడం " అన్నది.

బ్రతికి పోయాను అనుకున్నాడు.

తర్వాత కొంత కాలానికి "రాజూ నల్లపూసలు, అని అనుకుంటామా! ఆ నల్లపూసలదండలో వుండేది వజ్రాల డాలరట, అదొక్కటే లక్ష రూపాయలట" అంది రమణి.

”ఆహా ” అని ఊరుకున్నాడు రాజు.

ఇంకొక రోజు "మేడం ఆ నల్లపూసలు తప్ప వేరేది ఎందుకు వేసుకోదో నాకు తెలిసింది" అంది రమణి.

రాజు పలక్కుండా వున్నాడు.

" ఫంక్షన్ కి వేరే నగ వేసుకున్నా, మళ్లీ ఇంటికి రాగానే వెంటనే నల్ల పూసలదండనే వేసుకుంటుంది, అది అనిల్ సారూ, వాళ్ళ పెళ్లికి బహుమతిగా ఇచ్చారట అందుకని. " అంది.

“నీకెవరు చెప్పారు ? చాలా సమాచారమే వుందే ” అన్నాడు రాజు.

“అవ్వ చెప్పింది.... ”.అంది,మరీ ఏదో చెప్పబోతే నిద్ర నటించాడు.

ఆ తర్వాత మొదలైంది అసలు కథ. ”నాకు మేడం దగ్గరున్ననల్లపూసలదండ లాంటిది కావాలి”అంది.

“ఏంటి? " ఆటంబాంబు పక్కనే పడ్డట్టు ఎగిరి పడ్డాడు రాజు.

"వజ్రాలడాలరు వద్దులే , మామూలు రాళ్ళ డాలరు అట్లాన్టివే వుంటాయిట " అంది కొంచం కనికరం చూపిస్తూ.

"నీకేమన్నా పిచ్చా, ఇవి నల్ల పూసలు కాదూ ! " అన్నాడు ఆమె మెడలో నల్లపూసలు చూపిస్తూ.

“చ.. ఇదా . ఇది, అది ఒకటేనా ?”

“ మరి.. నేను అనిల్ సారూ ఒకటేనా ? మనం బంగారం కొనే స్థితిలో లేము, బంగారం మనకు అందే స్థితిలో లేదు.”

పలకకుండా వుండిపోయింది రమణి. మరుసటి రోజు మళ్లీ అదే గొడవ, మౌనంగా వుండి పోయాడు. చాలా గొడవల తర్వాత వూరికి డబ్బులు పంపడం మాని నల్ల పూసలదండకు దాచమంది రమణి .

”డబ్బు పంపక పోతే మా అమ్మానాన్నఇక్కడి నుండి ఈడ్చుకుని వెళ్తారు “అన్నాడు.

రెండు రోజులు ఆ చర్చ రాలేదు.


రమణి రోజూ ఏదో ఒకరకమైన గొడవ మొదలు పెడుతుంది ఆ దండ గురించి. రాజుకు రమణి అంటే భయం పట్టుకుంది. నేహమేడం కనపడినప్పుడు ఆమె మెడలో వున్న నల్ల పూసలదండ చూసాడు ఆమె గమనించకుండా, నిజమే ఆ నల్లపూసలు ఆమెకు చాలా శోభనిచ్చాయి, ఆ వజ్రాలడాలరు మెరిసిపోతోంది, నేహ మేడంకు బాగున్నంత మాత్రాన రమణికి కూడా అందాన్నిస్తుందను కోవడం పొరపాటే, కానీ కోరికలు గుర్రాలు కదా! వాటిని సరిగ్గా స్వారి చేయక పోతే అవి పలు దిక్కులకు పరిగెత్తుతాయి.


"ఇంటిపోరు ఇంతింతగాదయ " అన్నట్లు రమణి పోరుకు రాజు విసిగి పోయాడు. నేహమేడం దండ లాంటిది కొనాలంటే 26 వేల బంగారం ధరతో యాభైవేల దాక అవుతుంది. ఇవాళ రమణితో యుద్ధం తర్వాత రాజు కేమి తోచలేదు. ఇద్దరికీ మాటలు లేవు. ఇంటి కెల్లబుద్ధికాక తోటలో కూర్చున్నాడు. వంట్లోబాగాలేదని రమణి కూడా పనికి పోలేదు. నేహ దగ్గరకు రావడంతో లేచి నుంచున్నాడు రాజు .


“ఏంటి ..రమణికి ఏమయ్యింది ?” అంది.


“ మేడం ..వంట్లో బాగాలేదని ..” నసిగాడు రాజు.


"డాక్టర్ దగ్గరకు వెళతారా, ఫోన్ చేసి చెబుతాను ".


"అంత అవసరం ఏమీ లేదు మేడం, ఏదో చిన్ననలత అంతే." అన్నాడు.


నేహ చాలా విషయాలు అడిగింది రాజు కుటుంబం గురించి, వూరిదగ్గ విషయాలు, పొలాల గురించి, గ్రామ పరిస్థితుల గురించి ఆమె అంత ఆసక్తి చూయించే టప్పటికి .. రాజుకు కొంచం తన భాధకు పరిష్కారం దొరుకుతుందేమో ననిపించింది.


సందేహిస్తూనే అడిగాడు “మేడం మరోలా అనుకోకపోతే కొన్నిరోజులు ... మీరు ఆ నల్లపూసల దండ తీసేసి వేరేది వేసుకోండి ....”


ఆశ్చర్యం, విస్మయం తోటి మాట రాక ఉండిపోయింది నేహ. తర్వాత నిభాయిన్చుకుని రాజు ఎందుకు చెప్పి ఉంటాడో అని ఆలోచించుకాసాగింది ఆన్ని పాజిటివ్ గా తీసుకునే ఆమె ఔన్యత్యం.


"మేడం, యింత ధైర్యం చేసాడేంటి వీడు అనుకుంటారేమో ! నాకు తల్లి లాంటి వారు, వేరేగా అనుకోవద్దు, మీ నల్లపూసలదండ చూసినప్పటి నుండి అలాంటిది కొనమని రమణి చంపేస్తుంది .. మేము బంగారం కొనగలిగిన స్థితిలో లేము , తాళిబొట్టుకు, పెళ్ళికి అయిన ఖర్చుకే మావాళ్ళు అప్పు చేసారు, పంటలులేక, పల్లెలో వాళ్ళు ఎన్నో కష్టాలు పడుతుంటే రమణికి దండ చేయించడం కోసం ఇంటికి డబ్బులు పంపకుంటే వాళ్ళకు నా మొహం ఎలా చూపించేది మేడం మావూర్లో ? భార్యకు నగ చేయించడం కోసం నేను ఇలా దిగజారలేను, అలాగని ఆమె పోరుపడలేక మీకే చెబుతున్నాను " అన్నాడు.


ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుని నేహ హాయిగా నవ్వేసింది.“నీ ప్రాబ్లం నేను పరిష్కరిస్తా కదా! ” అంది.


రాజు ఏదో అనబోయేలోగానే.. నేహ లోపలి వెళ్లి పోయింది.


అనిల్ సారు వాళ్ళ పల్లె కెల్లాలంటే, రాజును కూడా వెళ్ళ మంది నేహ. రాజు వూరికి వెలుతున్నానని చెప్పినా, రమణి పలకలేదు. మేడం ఏదో చేస్తానన్నారుగా ! ఏమీ చేస్తారో చూద్దాం అనుకుని వెళ్లి పోయాడు.


రాజు అనిల్ తిరిగి వచ్చేటప్పటికి గేటు దగ్గరే ఎదురు చూస్తూ నుంచుంది రమణి. ఆమె నగుమోము చూసేటప్పటికి రాజుకు ఆశ్చర్యం కలిగింది, ప్రతిగానవ్వాడు. ఇంట్లోకి రాగానే ఆమె మెడలో నల్లపూసలదండ చూసాడు. కళ్ళు ఎగరేసాడు ఎక్కడిది అన్నట్లు. నవ్వి ఊరుకుంది సిగ్గు పడుతూ. భోజనం తర్వాత విశ్రాంతిగా పడుకున్నాక అతని గుండెలపై వాలిన ఆమెను మళ్ళి అడిగాడు.


"రాజూ.. నువ్వు దండ చేయించేదానికి అడ్వాన్సుఅడిగావట కదా! మేడం చెప్పారు ... వూరికి డబ్బులు పంపడం ఆపరాదని, నేనే ఇంట్లో పనులన్నీచేసే టట్లుంటే, బయటినుండి వచ్చే పనిమనిషి పని, దోబిపని, పాపని చూసే పని ఆన్నిచేస్తే నెల నెలా నాజీతంలో పట్టుకునేట్లు చెప్పి ఈదండ కొన్నారు. మేడం చాలామంచిది కదా రాజూ! దీని ధర సంవత్సరం లోపల తీరి పోతుంది".నవ్వుతూ చెప్పుకు పోతుంది నల్ల పూసల దండ చూసుకుంటూ. ఊపిరి పీల్చుకుని మనసులోనే నేహ మేడంకు ధన్యవాదాలు చెప్పుకున్నాడు రాజు. వారి శ్రామిక జీవన సౌందర్యాని కి ఊహలలోకం వాస్తవమై నిలిచింది.


ఫిబ్రవరి 2016, జాబిల్లి